సిర్పూర్(టీ), మార్చి 9 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని కస్తూర్బాలో ఇంటర్ కళాశాల అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్పై శనివారం రగడ జరిగింది. కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ కళాశాలకు అదనపు గదుల నిర్మాణం కోసం 2020లో రూ. 2.05 కోట్లతో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమిపూజ చేశారు. పనులు పూర్తికాగా, శనివారం ప్రారంభించేందుకు సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును ముఖ్య అతిథిగా, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావును విశిష్ఠ అతిథిగా అధికారులు ఆహ్వానించారు.
మొదట జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు రాగా, అప్పటి వరకు హరీశ్బాబు రాలేదు. అక్కడ ఎండగా ఉండడంతో అధికారులు కృష్ణారావు ను లోపలికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో గేటు దగ్గర అడ్డుగా ఉన్న రిబ్బన్ను అక్కడున్న ఓ అధికారి తొలగించారు.
దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. అక్కడున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు జడ్పీ చైర్మన్తో రిబ్బన్ కట్ చేయించారని, ఇది మా ఎమ్మెల్యేను అవమానించడమేనని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును బీజేపీ నాయకులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.
అధికారులు వెళ్లి ఆయనను మరోసారి ఆహ్వానించినా.. సున్నితంగా తిరస్కరించారు. మరో తేదీన కళాశాల ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కాగా, దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన అనంతరం జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఎంపీపీ చునార్కర్ సువర్ణ, వైస్ ఎంపీపీ ఈర్ల సత్యనారాయణతో కలసి ప్రారంభించారు. ఆ సమయంలో సంబంధిత అధికారులు, పాఠశాల ఎస్వో నాగసుధ లేకపోవడం గమనార్హం. ప్రొటోకాల్ వివాదంపై ఏఈఈ శరత్ను ఫోన్లో సంప్రదించగా తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఆ రిబ్బన్ను ఎవరూ కట్ చేయలేదన్నారు.