మంచిర్యాల టౌన్, మే 11 : వేసవి దృష్ట్యా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి పాలక, అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు ప్రతి గడపకూ నీరందించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. నీటి ట్యాంకర్ల ద్వారా తాగు నీరందించే కార్యక్రమాన్ని ఇటీవలే ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించారు. మున్సిపాలిటీకి చెందిన తొమ్మిది, అద్దెకు మూడు ట్రాక్టర్లు తీసుకుని 12 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా పైపులైను లేని ప్రాంతాలతోపాటు శివారు కాలనీలకు అందిస్తున్నారు. 12 ట్యాంకర్ల ద్వారా రోజూ 70-75 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు.
ఒక్కో ట్యాంకర్ రోజూ 6-7 ట్రిప్పుల నీటిని అందిస్తున్నది. ఇందుకు గాను గతనెల జరిగిన కౌన్సిల్ సమావేశంలో రూ.5 లక్షల పరిపాలనా అనుమతులు తీసుకున్నారు. రెండు నెలలపాటు నీటిని సరఫరా చేయనున్నారు. ప్రధానంగా తాగునీటితోపాటు అవసరమైన వారి ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీరందించాలని నిర్ణయించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వడ్డెర కాలనీ, రాజీవ్నగర్, దొరగారిపల్లి, పాత మంచిర్యాల, రంగంపేట, సున్నం బట్టివాడ, 100 ఫీట్ల రోడ్డు, అయ్యగారి గల్లి, వాసుదేవ కాలనీ, శ్రీశ్రీనగర్, సాయికుంట, ఎన్టీఆర్ నగర్, ఏసీసీ, సుభాష్నగర్, ఎడ్లవాడ, హమాలీవాడ, మజీద్వాడ, గోపాల్వాడ, పాతగర్మిళ్ల తదితర ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు.
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. ఎమ్మెల్యే దివాకర్రావు సూచనల మేరకు ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించి అవసరమైన ఏర్పాట్లు చేశాం. పైపులైన్లు లేని ప్రాంతాలు, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు తాగు నీరందించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరో రెండు ట్యాంకర్లను కిరాయికి తీసుకుని నడిపిస్తాం. తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేశాం. – పెంట రాజయ్య, మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల.