ఎదులాపురం, జూన్ 13 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీసే పని లేకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఫిజియోథెరపీ, సైక్రియాట్రిక్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.
అన్ని వయసుల వారికీ..
జిల్లా కేంద్రంలోని రిమ్స్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. నిత్యం వందలాది రోగులు ఉచితంగా సేవలు పొందుతున్నారు. రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్రే, స్కానింగ్ ఇతర పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. తాజాగా వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రాన్ని రూ.2 లక్షలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ వయోవృద్ధులకేకాకుండా అన్ని వయసుల వారికీ చికిత్స అందిస్తామని వైద్యులు చెబుతున్నారు.
ఫిజియోథెరపీ సేవలు..
ఈ మధ్య ఆర్థోపెడిక్ సమస్యలు పెరుగుతుండడంతో ఫిజియోథెరపీ అవసరం పెరుగుతూ వస్తున్నది. పక్షవాతంతో కాళ్లు, చేతులు, మూతి వంకరపోతున్నాయి. వివిధ రకాల కారణాలతో మోకాళ్లు, నడుం, కండరాలు, మెడ నొప్పులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్లు అరిగిపోతున్నాయి. కొన్ని సర్జరీల తర్వాత చికిత్స చేయించుకోవాల్సి వస్తున్నది. దాంతో ప్రైవేట్ ఆసుప్రతుల్లో ఫిజియోథెరపీ సేవలు పొందాలంటే పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రిమ్స్లోని పాత ఓపీ భవనంలో 18 రూమ్ నంబర్లో సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో అన్ని రకాల ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంచింది. ఐఎఫ్టీ,(ఇంటర్పరెన్షియల్ థెరపీ), ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్స్ స్టిమ్యులేషన్, థెరప్యూటిక్ అల్ట్రాసౌండ్ మిషన్, హైడ్రోకొలటోరా ప్యాకిల్స్, ట్రాక్షన్ యంత్రం, భుజం చక్రం, వెలునిచ్చెన, ఫిజియోబల్, తదితర మిషన్లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే నిత్యం 40 నుంచి 60 మంది ఫిజియోథెరపీ రోగులు వస్తున్నారని, ఎంత మంది వచ్చినా వైద్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫిజియోథెరపిస్టు నమ్రత చెబుతున్నారు.
అందుబాటులోకి సైక్రియాట్రిక్ సేవలు..
రిమ్స్ సూపర్స్పెషాలిటీలో మానసిక రోగుల కోసం సైక్రియాట్రిక్ కేంద్రం కూడా అందుబాటులోకి వచ్చింది. కొవిడ్ తర్వాత మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. మతిమరుపు, అతిగా సెల్ఫోన్ వాడడం వల్ల పిల్లలు, పెద్దల్లో సమస్యలు వస్తున్నాయి. సమకాలిన జీవన పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, వృద్ధులు కూడా అనేక రకాల ఒత్తిడులకు లోనై మానసిక రుగ్మతలకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మానసిక చికిత్స కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మద్యానికి అలవాటు పడిన వ్యక్తులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వారంలో ఒక రోజు అవుట్రిజ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు కూడా అందించనున్నారు. ఇతర వివరాలకు టెలిమానస్ హెల్ప్లైన్ నంబర్ 14416, 1800914416 అనే టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. రిమ్స్ సూపర్స్పెషాలిటీలో క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్, సోషనల్ వర్కర్ చిరంజీవి ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో మానసిక రోగుల కోసం సైక్రియాట్రిక్ కేంద్రం, రిమ్స్ పాత ఓపీ భవనంలో ఫిజియోథెరపీ కేంద్రం ఏర్పాటు చేశాం. మానసిక రోగులకు ఇక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ మెట్పెల్లివార్ శ్రీధర్, జిల్లా ఎన్సీడీ అధికారి
రిమ్స్లో ఉచితం..
ఫిజియోథెరపీ, మానసిక రోగులు చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానకు వెళ్లే రూ. 10 వేల దాకా ఖర్చు అవుతుంది. అదే రిమ్స్లో పరీక్షలు, మందులు కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తాం. ఫిజియోథెరపీ, మానసిక సమస్యలకు సంబంధించిన వారికి ఓపీ వైద్య సేవలు అందిస్తాం. ఇందుకు సంబంధించిన మిషన్లు, ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– రాథోడ్ నరేందర్ , డీఎంహెచ్వో ఆదిలాబాద్
మందులు లేకుండా నొప్పులు తగ్గిస్తాం
ఫిజియోథెరపీ ద్వారా మందులు లేకుండా ఒళ్లు నొప్పులు తగ్గిస్తాం. అలాగే ఇక్కడ నేర్పించిన ఫిజియోథెరిపీని ఇంట్లో చేసుకునేలా శిక్షణ ఇస్తాం. నొప్పులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తేనే రిమ్స్కు ఎప్పుడైనా రావొచ్చు. 50 ఏళ్లు పై బడిన వారు ఫిజియోథెరపిస్ట్ కేంద్రంలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
– నమ్రత, ఫిజియోథెరపిస్ట్, ఆదిలాబాద్ రిమ్స్