నేరడిగొండ : మండలంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని వందశాతం జరిగేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు, బీఎల్వోలకు సూచించారు. బుధవారం నేరడిగొండ ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్వోలతో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు విధిగా కల్పించాలని సూచించారు. గతంలో ఓటుహక్కు నమోదు ప్రక్రియ కొంత నిర్లక్ష్యంగానే కొనసాగిందన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండ చూడాలన్నారు. నేరడిగొండ మండలంలో వందశాంతం ఓటుహక్కు కలిగిన మండలంగా చూడాలని ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ఓటుహక్కు నమోదుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లక్ష్మణ్, టెక్నికల్ అధికారి ఉమాకాంత్, ఎంపీపీ రాథోడ్ సజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న తాసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.