మంచిర్యాల కలెక్టరేట్ సాక్షిగా భారీ మోసం బయటపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ తర్వాత పర్మినెంట్ చేపిస్తామంటూ అక్షర ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ 40 మంది వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా దండుకొని.. తీరా పనిలో చేరాక జీతాలు ఇవ్వడంలేదంటూ బాధితులు ఏజెన్సీపై కలెక్టర్కు.. ఆపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వివాదాస్పదమవుతున్నది. పైగా సదరు నిర్వాహకులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ముందే తమను చంపేస్తామని బెదిరించారంటూ వారు పోలీస్స్టేషన్ మెట్లెక్కగా, ముగ్గురిపై కేసు నమోదు చేయడం కలకలం రేపుతున్నది.
– మంచిర్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ సా క్షిగా భారీ మోసం బయటపడింది. నూతనంగా నిర్మించిన నస్పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు (గార్డెనింగ్, క్లీనింగ్, సెక్యూరిటీ గార్డు) పోస్టులు ఇప్పిస్తామని అక్షర ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడింది. ముందు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తాం, ఆ తర్వాత పర్మినెంట్ చేపిస్తామంటూ దాదాపు 40 మంది నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకొని తమతో కొన్ని నెలలుగా వెట్టిచాకిరీ చేయించారని, ఇప్పుడు జీతం అడిగితే ఇవ్వకపోగా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పలువురు వాపోతున్నారు. లక్షల రూపాయాలు తీసుకొని, వేతనాలు ఇవ్వకుండా తమ బతుకులను ఆగం చేసిన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కలెక్టరేట్లో గార్డెనింగ్, క్లీనింగ్, సెక్యూరిటీ గార్డు పోస్టులకు కాంట్రాక్ట్ తీసుకున్న అక్షర ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ.. అవసరానికి మించి రిక్రూట్ చేసుకుంది. దాదాపు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిసింది. ముగ్గురు సెక్యూరిటీ గార్డులు అవసరముంటే.. ఆరుగురు నుంచి ఏడుగురిని, గార్డెనింగ్ క్లీనింగ్ కోసం 10 మంది అవసరమైతే దాదాపు 25 మందిని చేర్చుకున్నారు. వీరంతా ప్రస్తుతం కలెక్టరేట్లో పని చేస్తున్నారు. కొన్ని నెలలుగా పని చేస్తున్నా.. ఎవరికీ వేతనాలు రాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులను నిలదీసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న సదరు ఏజెన్సీ నిర్వాహకుడు వారిని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ముందే బెదిరించినట్లు చెప్తున్నారు. కలెక్టర్, జేసీ, ఏవో అందరూ నా దోస్తులే.. మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి.. ఎక్కువ చేస్తే చంపేస్తానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో సొమవారం ప్రజావాణిలో సైతం కొందరు మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దీనిపై నేరుగా ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో జాప్యం జరుగకూడదనే ఉద్దేశంతో గురువారం నస్పూర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించారు.
దాదాపు 12 మంది బాధితులు స్టేషన్కు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఏజెన్సీ ఎండీ గుర్రం శ్రీనివాస్, వినోద్, శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్నామని, కోర్టులో సబ్మిట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై సదరు ఏజెన్సీ ఎండీ శ్రీనివాస్ను వివరణ కోరగా.. కావాలనే తనను టార్గెట్ చేసి కొందరు ఇదంతా చేస్తున్నారన్నారు. ఒక్క మంచిర్యాలలోనే ఇలా ఉంది.. ఇంకెక్కడా ఇలా లేదని చెప్పారు. కాగా.. అమాయకులను ఇంత మోసం చేసిన ఈ ఏజెన్సీ అసలు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో రిజిస్టరై లేనట్లు తెలిసింది. త్వరలోనే అన్ని విషయాలపై స్పష్టత ఇస్తామని పోలీసులు తెలిపారు.