సిర్పూర్(టి), నవంబర్ 1 : మండలంలోని టోంకిని గ్రామంలోని శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 21వ మహాపాదయాత్ర భక్తజన సంద్రంగా మారింది. ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాపాదయాత్రకు జిల్లాలోని పలు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవడంతో టోంకిని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కాగజ్నగర్ పట్టణం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో కాగజ్నగర్ మండలంలోని ఈజ్గాం, ఇతర గ్రామాలతో పాటు సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి, పెద్దబండ, సిర్పూర్(టీ)తో పాటు పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. కాగజ్నగర్ నుంచి సిర్పూర్(టీ), టోంకిని వరకు పాదయాత్రగా వస్తున్న భక్తులకు కొందరు భక్తులు పండ్లు, ఫలహారాలతో పాటు టీ అందించారు. భక్తులు బారులు తీరి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు, జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ దంపతులు, అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, డీఎస్పీ కరుణాకర్, కౌటల సీఐ బుద్ధేస్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
భారీగా పోలీసు బందోబస్తు..
కాగజ్నగర్ పట్టణం నుంచి మహాపాదయాత్రగా వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సిర్పూర్(టీ) ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంగళవారం టోంకిని మహాపాదయాత్రలో భాగంగా టోంకిని ఆలయాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ సందర్శించి, బందోబస్తును పరిశీలించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటల సీఐ బుద్ధేస్వామి, సిర్పూర్(టీ) ఎస్ఐ రవికుమార్, ఇతర మండలాల
ఎస్ఐలు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం..
టోంకిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో టోంకిని మహాపాదయాత్రకు వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వేంపల్లిలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు బాదం మిల్క్, సిర్పూర్(టీ) సర్పంచ్ తఫిమా పర్విన్ ఆధ్వర్యంలో భక్తులకు టిఫిన్లు పంపిణీ చేశారు. కాగజ్నగర్ పట్టణం నుంచి సిర్పూర్(టీ) మీదుగా టోంకిని వరకు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, యువకులు పండ్లు, మజ్జిగ, పాలు, టీ పంపిణీ చేశారు.