దస్తురాబాద్, సెప్టెంబర్ 11 : వ్యవసాయ రంగంలోకి 1958 సంవత్సరంలో ప్రవేశించిన యూరియా.. సాగులో అత్యంత కీలకంగా మారింది. అది లేకుంటే పొలాలకు ప్రాణం లేనట్టే. దాని కోసం గత ప్రభుత్వాల పాలనలో ప్రాణాలు చలించే సంఘటనలూ చోటుచేసుకున్నాయి. అదే స్వరాష్ట్రంలో యూరియా కొరత లేకుండా రైతులు భరోసాతో ఉన్నారు. ఘన రూపంలో ఉండే యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ ఫార్మర్స్ ఫార్టిలైజర్స్ కో-ఆపరేటివ్ (ఇఫ్కో) సంస్థ ఇటీవలే ద్రవ రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విక్రయిస్తున్నారు.
అర లీటర్ నానో యూరియా.. ఎకరానికి
ప్రస్తుతం మార్కెట్లో ఒక్క యూరియా బస్తా రూ.270 నుంచి రూ.290 రకు విక్రయిస్తున్నారు. అర లీటర్ ద్రవ రూపంలో ఉండే యూరియా రూ.140 నుంచి రూ.200 వరకు ధర ఉంది. ఇది ఎకరానికి సరిపోతుంది. అర లీటర్ నానో యూరియా బాటిల్ ఒక యూరియా బస్తాతో సమానం. ఘన రూప యూరియా ప్రభావం మొక్కపై కేవలం రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ద్రవ రూపంలో ఉన్న యూరియా, 8 రోజులతో పాటు ప్రభావన్ని చూపుతుంది. దీనికి ప్రస్తుతం మార్కెట్లో ఆదరణ లభిస్తున్నది. నానో యూరియా రవాణా చాలా సులభం. జేబుల్లో, కవర్లలో, బ్యాగులో పెట్టుకొని ఎకరానికి సరిపోయే యూరియాను తీసుకెళ్లవచ్చు. ప్రసుత్తం రైతులకు వ్యవసాయ అధికారులు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రయోజనాలు..
సంప్రదాయ యూరియాతో పోల్చితే తక్కువ అవసరం. పంటల ఉత్పాదకతను పెంచుతుంది. ఆహారం, పర్యావరణానికి సురక్షితమైనది. వృక్ష, జంతుజాలానికి విషపూరితం కాదు. రైతులకు సబ్సిడీతో కూడిన యూరియా బస్తా కంటే 10 శాతం తక్కువ ధరకే ఈ నానో యూరియా అందుబాటులో ఉంది. పంట దిగుబడి శాతం పెరుగుతుంది. సాధారణ యూరియాతో పోలిస్తే గాలి, నేల, నీటి కాలుష్యం ఉండదు. మొదటి పిచికారి.. విత్తనం మొలకెత్తిన 30 రోజుల తర్వాత, రెండో పిచికారి పుష్పించే వారం ముందు చేయాలి. లీటర్ నీటిలో 4 మిల్లీ మీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలి. దీంతో నత్రజని నేరుగా మొక్కల పత్ర హరితాల్లోకి చొచ్చుకుపోతుంది. నత్రజని ఎక్కువ అవసరం ఉన్నా నానో యూరియా ప్రయోజనకారిగా ఉంటుంది. నానో యూరియాలో సరాసరిగా 1.5 శాతం నత్రజని, 1 శాతం పోటాషియం, 0.5 శాతం కాల్షియం, 0.2 శాతం పాస్పరస్, 0.2 శాతం మెగ్నీషియం, 0.1 శాతం సల్ఫర్ ఉంటాయి.
నానో యూరియాతో లాభాలు..
నానో యూరియా వాడడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఇందులో 80 శాతం నత్రజని ఉంటుంది. అర లీటర్ నానో యూరియా బాటిల్ ఒక యూరియా బస్తాతో సమానం. ఖర్చు చాలా ఆదా అవుతుంది. మొక్కలకు కావాల్సిన నత్రజని పోషకం ద్రవ రూపంతో ఎక్కువ శాతం అందుతుంది. 500 మిల్లీలీటర్ల్ల నీటిలో 125 మిల్లీలీటర్ల నానో యూరియాను కలిపి పిచికారి చేసుకోవాలి. దీన్ని అన్ని పంటలకు వాడకోవచ్చు. – జాడి తిరుపతి, ఏఈవో, దస్తురాబాద్ క్లస్టర్