కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/తిర్యాణి/లింగాపూర్, ఫిబ్రవరి 9 : దట్టమైన అడవుల జిల్లాగా పేరుగాంచిన జిల్లా అటవీశాఖలో ఇంటి దొంగలు పెట్రేగిపోతున్నారు. స్మగ్లర్లతో చేతులు కలిపి విలువైన కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అడవుల్లో నేల కొరిగిన టేకు వృక్షాల మొదల్లే అధికారుల అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జోడేఘాట్ అటవీ రేంజ్ పరిధిలో తరచుగా కలప పట్టుబడుతుండగా, విచారణ చేపట్టిన అటవీ శాఖ ఉన్నతాధికారులు విస్తుపోయే నిజాలను గుర్తించారు.
క్షేత్ర స్థాయిలో అడవులను పర్యవేక్షించి రక్షించాల్సిన అధికారులే కంచె చేను మేసిన చందంగా.. స్మగ్లర్లతో చేతులు కలిపి అడవుల నరికివేతకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బాధ్యులను సస్పెండ్ చేయడంతో పాటు అడవుల నరికివేతకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్న గ్రామాల్లో ఆకస్మికంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. గురువారం జోడేఘాట్ రేంజ్ పరిధిలోని బాండేయేర్, పెద్ద దోభ, పిక్లతాండా, వంజరిగూడ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 2 లక్షల విలువ చేసే కలపతో పాటు కలప కోసే నాలుగు భారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా విస్తీర్ణంలో 54 శాతం అడవులే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం టైగర్ జోన్గా గుర్తించింది. అడవుల్లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. అడవులను కాపాడాల్సిన అధికారులే స్మగ్లర్లతో చేతులు కలిపి అడవుల నరికివేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసిఫాబాద్ అటవీ డివిజన్లోని దట్టమైన అటవీ ప్రాంతాలు కలిగిన గిన్నెధరి, కెరమెరి, జోడేఘాట్, తిర్యాణి అటవీ రేంజ్ల పరిధిలో సుమారు లక్షా 10 వేలకు పైగా హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంత మొత్తం దాదాపు విలువైన టేకు వనాలతోనే నిండి ఉంది.
జోడేఘాట్ అటవీరేంజ్ పరిధిలోని బాండేయేర్, పెద్దదోభ, పిక్లతాండ, గీతబండ, చింతగూడ గ్రామాల నుంచి నిర్మల్ జిల్లా పరిధిలోనికి వచ్చే ఉడుంపూర్ అటవీ రేంజ్లోకి, నిర్మల్ పరిధిలోకి వచ్చే ఇందన్పల్లి రేంజ్లోకి అటవీ మార్గం గుండా దారులు ఉన్నాయి. ఉడుంపూర్ రేంజ్లోని ఇస్లాంపూర్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. లింగాపూర్ మండలం గీతబండా, కొత్తపల్లి గ్రామాల నుంచి ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ వరకు అడవులను నరుకుతున్నట్లు తెలుస్తున్నది.
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ అడవుల్లోకి మనుషులు వెళ్లడాన్ని నిషేధించటంతో స్మగ్లర్ల ఆగడాలకు అదుపులేకుండా పోతున్నది. క్షేత్రస్థాయిలో అడవులను నిరంతరం రక్షించే అటవీ అధికారులే స్మగ్లర్లతో చేతులు కలపడంతో టేకు చెట్ల నరికివేత విచ్చల విడిగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. గిన్నెధరి, జోడేఘాట్, తిర్యాణి అటవీ రేంజ్ల పరిధిలోని అడవుల్లో ఎటుచూసినా నరికివేసిన టేకు చెట్ల మొదల్లే దర్శమిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు నాణ్యమైన టేకు వనాలు కలిగిన మొర్రిగూడ, మంగి, కౌటాగాం, గీసిగూడ, ఎర్రబండ, రోంపల్లి అటవీ ప్రాంతాల్లో కూడా విలువైన టేకు వనాలు నరికివేతకు గురవుతున్నాయి. గిన్నెధరి, కెరమెరి, జోడేఘాట్, తిర్యాణి రేంజ్ పరిధిలో దాదాపు 110 అటవీ బీట్లు ఉన్నాయి. వీటి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అటవీ అధికారుల దురాగతాలు మరిన్ని బయటపడే అవకాశాలున్నాయి.
జోడేఘాట్ రేంజ్ పరిధిలోని బాండేయేర్, పెద్ద దోభ, పిక్లతండా, వంజరిగూడలో గురువారం అటవీ అధికారులు చేపట్టిన కార్డన్ సెర్చ్లలో కలప కోసే నాలుగు భారీ యంత్రాలను అటవీ అధికారులు గుర్తించడాన్ని గమనిస్తే చెట్ల నరికివేత, కలప రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీ అధికారుల సహకారంతోనే జరుతోందని అర్థమవుతోంది. తనిఖీలకు వచ్చిన అటవీ అధికారులను అడ్డుకునే ప్రయత్నాలను కూడా ఆయా గ్రామాల ప్రజలు చేసినట్లు తెలుస్తోంది. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టాలంటే అటవీ శాఖ ఉన్నతాధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.