సోన్, జూలై 30 : అధిక మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకెర వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆదివారం 33 మంది బ్రాహ్మోణోత్తమ జంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 150 ఆర్యవైశ్య జంటలు వాయినాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరై మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో బ్రాహ్మణోత్తములకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ అధ్యక్షుడు కిషన్ తెలిపారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముత్యం సంతోష్గుప్తా, చింతకుంట గంగాధర్, బొద్దుకూరి సందానంద్, మహేందర్, సునీల్కుమార్, రమేశ్, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు అర్చన, చిన్నవార్ కమలేశ్వరి, ఆలయ పూజరులు, భక్తులు, పాల్గొన్నారు.
మంత్రి అల్లోలను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
నిర్మల్ అర్బన్, జూలై 30 : పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 13వేల పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లాకు చెందిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం సభ్యులు ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గతంలో సీఎం కేసీఆర్ 13వేల ఉద్యోగాలను అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాకాల రాంచందర్, సంఘ సభ్యులు సురేశ్, తిరుమలేశ్, సంతోష్, దేవీదాస్ ఉన్నారు.