మంచిర్యాల జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం చిన్నాపెద్దా తేడా లేకుండా పరస్పరం రంగులు పూసుకున్నారు. యువతీ యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
మంచిర్యాల ఏసీసీ/దండేపల్లి/జన్నారం/తాండూరు/మందమర్రి/ వేమనపల్లి/కన్నెపల్లి/చెన్నూర్టౌన్/లక్షెట్టిపేట/నెన్నెల/ రామకృష్ణాపూర్/ కోటపల్లి/హాజీపూర్/శ్రీరాంపూర్, మార్చి 25 : మంచిర్యాల పట్టణంలో ప్రజలతో పాటు పోలీసులు, నాయకులు, అధికారులు అంతా కలిసి ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సమీప గోదావరి నదికి వెళ్లి స్నానం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు స్థానికులు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ వద్ద, టీఎన్జీవో భవనం వద్ద టీఎన్జీవోఎస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా కార్యదర్శి భముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు రాంకుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి ప్రభు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు లక్ష్మణ్, బెల్లంపల్లి అధ్యక్షుడు వెంకటేశ్, ప్రణవ్ పాల్గొన్నారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. జన్నారంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారులు వేడుకలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ జక్కు భూమేశ్, ఎంఈవో విజయ్కుమార్, నాయకులు జాజాల శ్రీనివాస్, సత్యనారాయణ నగురు, సుధాకర్నాయక్, చెట్పెల్లి క్రిష్ణ, వొజ్జల వామన్ పాల్గొన్నారు.
తాండూరులో మండలం మాదారం వీధుల్లో గ్రామస్తులు భజన కీర్తనలు పాడుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని మార్కెట్, పాలచెట్టు ఏరియా, ప్రాణహిత కాలనీ, శ్రీపతినగర్, దీపక్నగర్, రామన్కాలనీ, విద్యానగర్, పాతబస్టాండ్, యాపల్ ఏరియా, అంగడిబజార్ ఏరియాల్లో సంబురాలు జరిగాయి. సింగరేణి పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మందమర్రి సీఐ శశీధర్ రెడ్డి ఇంటికి వెళ్లి రంగులు చల్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి జోన్ కాలనీకి చెందిన టీబీజీకేఎస్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి రాజశేఖర్ ఇంటికి వెళ్లి రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు రెండో జోన్లోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో ఆదివారం రాత్రి కామ దహన కార్యక్రమం నిర్వహించారు.
చెన్నూర్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, ప్రజలు పాల్గొన్నారు. లక్షెట్టిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రకుమార్ సిబ్బందితో పాటు చిన్నారులతో కలిసి హోలీ నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్లో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ నృత్యం చేశారు.
శ్రీరాంపూర్ ఏరియాలోని వాటర్ ట్యాంక్ ఏరియా, ఆర్కే 6గుడిసెలు, శ్రీరాంపూర్ ఏరియా గనులపై, గాందీనగర్, క్రిష్ణాకాలనీ, ఆర్కే 8కాలనీ, అరునక్కనగర్, శ్రీరాంపూర్ కాలనీలో కార్మికులు, కార్మిక కటుంబాలు, ప్రజలు, వ్యాపారస్తులు, టీబీజీకేఎస్ నాయకులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియాలో నస్పూర్ మాజీ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ లంబాడాలతో కలిసి నృత్యాలు చేశారు. ఇక వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల, కోటపల్లి, హాజీపూర్ మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.