చరిత్రలో నిలిచేలా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. రూ. 100 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. ఆలయ మ్యాప్ను పరిశీలించారు. టెండర్లు పూర్తయిన వెంటనే వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, ప్రత్యేకంగా వచ్చిన వేద, జ్యోతిష్య పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమం నిర్వహించారు.
బాసర, మార్చి,24: బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శుక్రవారం గర్భగుడి విస్తరణ, ప్రాకార మండపం వెడల్పు, రాజ గోపుర నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం బాలాలయం ఏర్పాటు చేసే రూ. 150 అక్షర మండపం పరిశీలించి ఆలయ అధికారులు, అర్చకులు, ఇంజినీర్లతో కలిసి మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ యాదాద్రి తరహాలో కృష్ణ శిలలతో గర్భగుడిని నిర్మించేందుకు, ఇతర అభివృద్ధి పనులకు శృంగేరి పీఠాధిపతుల అనుమతితో భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి, ఆమోదం కాగానే 15 రోజుల్లో టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు.
మొదటి విడుతలో రూ. 100 కోట్లతో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే రూ. 50 కోట్లు మంజూరయ్యాయని, రూ. 8 కోట్లతో ఆలయ అతిథి గృహాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ. 42 కోట్లు ఉన్నాయని, మరో రూ. 50 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాదాల స్కీం ద్వారా నిధులు ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపి చాలా రోజులైందని, వారు జాప్యం చేస్తున్నారని తెలిపారు. త్వరగా విడుదల చేసేందుకు మరోసారి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. ఆర్డీవో రవి కుమార్, ఆలయ ఈవో విజయ రామా రావు, చైర్మన్ శరత్ పాఠక్, ఇంజినీర్ల బృందం, బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావు, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు, కిర్గుల్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ రమేశ్ రావు, నాయకులు జిడ్డు మల్లయ్య, మల్లన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోర్వ శ్యామ్ పాల్గొన్నారు.
ఉదయం నుంచే పూజలు
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఉదయం 4.30 గంటల నుంచే శ్రీ పీఠం నాచగిరి మధుసూదనానంద సరస్వతీ స్వామి సమక్షంలో సంకల్పం, గణపతి పూజ, హోమం, సరస్వతీ మం త్ర హోమం, పుర్ణాహుతి పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి పాల్గొని హోమ మండపంలో పుర్ణాహుతితో ముగించారు. కాగా, భూమి పూజకు సీఎం కేసీఆర్ ఇద్దరు వేద, జ్యోతిష్య పండితులను బాసరకు పంపారు. వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ, విరివింటి ఫణి శశాంక శర్మ సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి, విధు శేఖర భారతీ మ హాస్వామి వారి అనుమతితో పూజలను నిర్వహించామన్నారు.