ఆదిలాబాద్ – 1,70,470
మంచిర్యాల – 1,45,852
నిర్మల్ – 1,92,561
ఆసిఫాబాద్ – 1,17,976
మొత్తం – 6,26,859
తెలంగాణ సర్కారు ఆహార భద్రత కార్డుదారులకు తీపికబురు అందించింది. ఆరోగ్య శ్రీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇంతకముందు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు మాత్రమే వైద్యం అందేది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలతోపాటు జిల్లా కేంద్ర, ఏరియా దవాఖానల్లోనే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ తరహా సేవలు అందుబాటు లోకి వచ్చాయి. దాదాపు 110 రకాలకుపైగా వ్యాధులకు చికిత్స చేయనున్నారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 6,26,859 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. తాజా నిర్ణయంతో ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
నిర్మల్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : ఆహార భద్రత కార్డుదారులకు ఆరోగ్యశ్రీ సేవలు అందనున్నాయి. ఆరోగ్య శ్రీ-ఆయుష్మాన్ భారత్లో చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డు అయినా ఉండాలి.. లేకుంటే తెల్లరేషన్ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి. ఫలితంగా ఆయా కార్డుదారులు పలు రకాల వైద్య సేవలను ఉచితంగా పొందుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రేషన్ కోసం తెల్లకార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది. ఈ కార్డుదారులు కేవలం రేషన్కు మాత్రమే పరిమితం కాగా.. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్య సేవలను పొందే అవకాశం లేకుండా పోయింది. ఏదైనా అత్యవసర సందర్భాల్లో చికిత్సలు పొందాలంటే ఈ కార్డుదారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక అనుమతులు పొందాల్సి వస్తున్నది. దీనిపై ప్రభుత్వానికి వినతులు వెళ్లడంతో ఊరట గొలిపే విధంగా సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. మానవతా దృక్పథంతో సీఎం తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ఏరియా దవాఖానల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండేవి. అయితే ఇటీవలే ప్రభుత్వం అన్ని పీహెచ్సీల్లోనూ ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఉమ్మడి జిల్లాలో 6,26,859 కుటుంబాలకు లబ్ధి
అత్యవసర వైద్యసేవలు అవసరమైనపుడు నిరుపేద ప్రజానీకం రూ.లక్షలు వెచ్చించి చికిత్సలు చేయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్రం అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేటుల్లోనూ వైద్య సేవలను అందిస్తున్నప్పటికీ ఈ సేవలు కేవలం ఆరోగ్యశ్రీ, తెలుపు కార్డుదారులకు మాత్రం అందుతున్నాయి. ఈ కార్డులు లేనివారు వైద్యసేవలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆహార భద్రత కార్డులు కలిగిన వారందరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు అందనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాలుగా ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను అందజేసింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో 1,70,470 ఆహార భద్రతా కార్డులు, మంచిర్యాలలో 1,45,852, నిర్మల్లో 1,92,561, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 1,17,976 కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు కలిగిన అన్ని కుటుంబాలు ఉచిత వైద్యసేవలు అందనున్నాయి.
రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్
ఈ చిన్నారి పేరు సంతోష. వయసు పదకొండేళ్లు. నిర్మల్ జిల్లా సోన్ మండలం లోని గాంధీనగర్. కొంతకాలం క్రితం కడుపులో నొప్పి రావడంతో తల్లిదండ్రు లు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అపెండిక్స్ అని.. వెంటనే ఆపరే షన్ చేయాలని సూచించారు. ప్రైవేటులో డబ్బులు పెట్టి చేయించే స్థోమత లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉచితంగా ఆపరేషన్ చేయించారు. కార్డు లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదోనని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణ పడి ఉంటం..
నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండబట్టి ఎడమ కాలుకు ఆపరేషన్ చేయించుకున్న. రూపాయి ఖర్చు కాలేదు. నా లాగా కార్డులేని వాళ్ల పరిస్థితి ఏంటి? సీఎం కేసీఆర్ దయతో ఆహార భద్రత కార్డులు ఉన్నవాళ్లందరికీ ప్రైవేటు, గవర్నమెంటు దవాఖానల్లో ఉచితంగానే చికిత్సలు చేయిస్తున్నరు. పేదల కోసం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– వెంకుబాయ్, నర్సాపూర్, నిర్మల్ జిల్లా.
తక్షణమే అమల్లోకి..
ఆహార భద్రత కార్డుదారులను కూడా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ల కింద పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఆయా కార్డులు కలిగిన వారు నేరుగా ఆసుపత్రులకు వెళ్లి 110కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్సలు పొందవచ్చు. ప్రభత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఆహార భద్రతా కార్డుదారులు అత్యవసర వైద్య సేవల సందర్భంలో సద్వినియోగం చేసుకోవాలి.
– కౌటిక శ్రీనివాస్, జిల్లా కేంద్ర దవాఖాన ఆరోగ్యమిత్ర అధికారి, నిర్మల్.