ఆదిలాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ప్రజాతీర్పును కాలరాస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్తోపాటు ఇతర నాయకులను ఆయన మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, శంభీపూర్ రాజు, జీవన్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పులు ఎంత పెద్ద నాయకుడైనా శిరసా వహించాలన్నారు.
క్యాతననపల్లిలో మొదటిసారి చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవ చేసి ఎన్నిక జరగకుండా చేశారని, రెండోసారి దుర్మార్గంగా మంత్రి వివేక్ సమక్షంలో దళిత, గిరిజన కౌన్సిలర్లపై కాంగ్రెస్ నాయకులు అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తాగి వచ్చి దాడికి పాల్పడ్డారని, మంత్రి వద్దకు వెళ్లి మహిళా కౌన్సిలర్లు తమపై దాడి చేశారని చెబితే అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యవహరించారన్నారు.

మంత్రి వివేక్ కనుసన్నల్లో అధికారులు చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లో క్యాతన్పల్లి ఎన్నికల హాల్లోకి పంపించని పోలీసులు మంత్రి వివేక్ కాన్వాయ్ని లోనికి ఎందుకు పంపాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి వివేక్ కాన్వాయ్ను ఎందుకు లోపలికి పంపించారని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై రాళ్లదాడి చేశారని, బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డి కారును దాళ్లతో ధ్వంసం చేశారని తెలిపారు.
అన్యాయంగా బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్లపై కేసులు పెట్టారని.. రామగుండం, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్లో జైలు ఉన్నా పోలీసులు కావాలని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు బీఆర్ఎస్ నాయకులను తరలించారు. అరెస్ట్ చేసిన బాల్క సుమన్తోపాటు ఇతర నాయకులకు పోలీసులు కనీసం అన్నం పెట్టలేదని, మంచినీళ్లు ఇవ్వలేదన్నారు.

సింగరేణి ప్రాంతమైన క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారన్నారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ బంగారు బాతుగా మార్చి దోపిడి చేస్తున్నదని, సింగరేణిలో భారీ స్కాంలు బయటపడగా, కార్మికులందరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులను పెట్టి కాంగ్రెస్ నాయకులు గెలవడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాదు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
బాల్క సుమన్ అరెస్ట్ విషయంలో జిల్లా కోర్టుతోపాటు అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని, వాస్తవాలను న్యాయ వ్యవస్థ ముందు పెడుతామన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, చట్టపరంగా ముందుకుపోతామని తెలిపారు. త్వరలో సుమన్ను, పార్టీ నాయకులను విడుదల చేయించుకుంటామని పేర్కొన్నారు. బాల్క సుమన్కు పోరాటాలు కొత్తకాదని, విద్యార్థి సంఘం నాయకుడిగా సమైక్యవాదులపై పోరాడారని, ప్రజాస్వామ్య రక్షణ కోసం సుమన్ పోరాడుతున్నారని తెలిపారు. దళిత నాయకుడైన సుమన్పై రేవంత్రెడ్డి పగతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్రావు పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర నాయకులు జిల్లా జైలుకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలుకు తరలివచ్చారు. నాయకులు జైలు లోపలికి వెళ్లినప్పుడు జైలు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బాల్క సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం అడ్డదారులు తొక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.