కడెం, జూలై 29: పులుల సంరక్షణకు అటవీ సంపదను కాపాడాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలో 70 శాతం పులులు సురక్షితంగా ఉన్నాయని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని ఏడు రేంజ్ కార్యాలయాల పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతం ఉందని, ఇందులో వేల సంఖ్యలో వన్యప్రాణులున్నట్లు తెలిపారు. గతంతో పోల్చితే ప్రస్తుతం వన్యప్రాణుల వేట చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. వన్యప్రాణులను వేటాడడం వల్ల విధించే శిక్షలు కఠినతరంగా ఉండడంతో చాలా వరకు వేట తగ్గుముఖం పట్టిందన్నారు.
ఈ ప్రాంతంలో పులుల సంచారం సాధ్యమేనని, కానీ కోర్ ఏరియా పరిధిలో నివాసముంటున్న గ్రామాలను అక్కడి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, పశువులు అటవీ ప్రాంతంలో జీవనం సాగించడం వల్ల ఇబ్బందులు తలేత్తే ప్రమాదం ఉందని, ఇప్పటికే కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట గ్రామాల ప్రజలను మొదటి విడుత కింద బయటకు తీసుకొచ్చేందుకు వారికి అవగాహన కల్పించామని, పరిహారం కింద రెండు రకాల అవకాశాలను ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే మొదటి విడుతగా ఈ రెండు గ్రామాల ప్రజలను అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. తడోబా వంటి ప్రాంతాలను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, త్వరలోనే కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోకి తిరిగి పులుల సంచారం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి అనిత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి రక్షణలో పులులది అగ్రస్థానం
ఖానాపూర్ టౌన్, జూలై 29 : పర్యావరణ, ప్రకృతి రక్షణలో పులులు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయని ఖానాపూర్ ఎఫ్ఆర్వో జీ వినాయక్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, పులుల ఆవాసం సుస్థిరంగా ఉండాలంటే వాటికి సరైన ఆహారం అవసరమన్నారు. అందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెంబి మండలంలో..
పెంబి, జూలై 29: పులుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఆర్వో ప్రతాప్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవ వేడుకలను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. పులుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్య ప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమన్నారు. భావితరాలకు వన్య ప్రాణులను అం దించాల్సిన బాధ్యత మనందరిదని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్వోలు శ్రీనివాస్, ప్రభాకర్, ఎఫ్బీవోలు ఉదయ్, మనోహర్, మహేందర్, సంతోష్, శివ పాల్గొన్నారు.