బోథ్, సెప్టెంబర్ 1 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు. గ్రేహౌండ్, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉన్న నిగిని అటవీ ప్రాంతం వైపు ఇటీవల మావోయిస్టులు వచ్చి వెళ్లారనే పక్కా సమాచారంతో పోలీసులు అడవిలో సోదాలు చేశారు. కైలాస్ టేకిడి మార్గంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు ఓ హ్యాండ్ గ్రెనైడ్ లభ్యమైనట్లుగా సమాచారం.
దీనిని పోలీసు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. పొచ్చెర గ్రామానికి చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మావోయిస్టు దళంలో పని చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. రిక్రూట్మెంట్తోపాటు కార్యకలాపాల విస్తరణలో భాగంగా బోథ్ ప్రాంతానికి వచ్చి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతున్నది. పోలీసులకు లభ్యమైన హ్యాండ్ గ్రెనైడ్ ఇటీవల మావోయిస్టుల సంచారంలో చేజారిందా..? లేక గతంలోనే వదిలి వెళ్లారా..? అనే విషయం తేలాల్సి ఉంది. మళ్లీ మావోయిస్టుల అలజడితో పోలీసుల కూంబింగ్ మొదలు కావడంతో పల్లెల్లో భయానక వాతావరణం కనిపిస్తున్నది. ఎప్పుడేం జరుగుతుందోనని అటవీ సమీప ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.