మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూర్ ( Chennur ) బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ( Student ) శ్రీహిందు ( Sri HIndu -13) గడ్డిమందు తాగి ఆత్మహత్య( Suicide ) చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస్తున్నారని కొన్ని రోజుల క్రితం తల్లికి ఫోన్లో చెప్పిన శ్రీహిందు ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పురుగుల మందు తాగిన విద్యార్థినికి సరైన వైద్యం అందించకపోవడంతోనే ఆమె మృతి చెందిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితురాలి తండ్రి రాళ్లబండి రమేశ్ కథనం ప్రకారం.. చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీహిందు రెండు సంవత్సరాలుగా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకల పాఠశాలలో చదువుకుంటుంది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుకుంటున్న ఆమె వాంతులు చేసుకుంటుందని, చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని బుధవారం రాత్రి 10.30 గంటలకు హాస్టల్ నుంచి ఫోన్ చేశారన్నారు.
విషయం తెలుసుకొని హుటాహుటినా ఆసుకుత్రికి వెళ్లిన తాను శ్రీహిందు హాస్టల్లో తిన్నది ఏదో పడలేదని, వాంతులు చేసుకుంటుందని చెప్పి పాపను అప్పగించి స్కూలు వాళ్లు వెళ్లిపోయారన్నారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు చెన్నూర్ ప్రభుత్వ ఆసుకుత్రిలో డాక్టర్లు చికిత్స చేశారని, శనివారం సీరియస్ ఉందని ఎక్కడికైనా తీసుకెళ్లాలని వైద్యులు చేతులెత్తేశారని వాపోయారు.
అక్కడి నుంచి శనివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే పాప ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పారన్నారు. మంచిర్యాల ఆసుపత్రిలో టెస్టులు చేశాక పాప కిడ్నీలు, లంగ్స్ పూర్తిగా పాడైపోయాయని, జాండిస్ వచ్చిందని ఇక్కడి వైద్యులు చెప్పారని వివరించారు. చికిత్సపొందుతూ కూతురు ఆదివారం ఉదయం చనిపోయిందంటూ బోరున విలపించారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన.. ఆర్జీతో హామీతో విరమణ
విద్యార్థిని శ్రీహిందు మృతికి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే కారణమని విద్యార్థిని తల్లిదం డ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, జైపూర్ ఏసీసీ వెంకటేశ్వర్లు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు.
ఆర్డీవో శ్రీనివాస్రావు అక్కడికి చేరుకొని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ప్రత్యేక అధికారిని నియమించి శ్రీహిందు మృతిపై సమగ్ర విచారణ చేయిస్తామని, మీ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ అవ్వడంతో ఆందోళన విరమించారు.
అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, విద్యార్థిని మృతికి ముందు మరణ వాంగూల్మం ఇచ్చిందని అందులోని అంశాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.