సోన్, అక్టోబర్ 16 : సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. శారీరక దార్యుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలపై విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను కనబరుస్తూ ఎన్నో పతకాలను సాధిస్తున్నారు. ఇదే క్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్పోచంపాడ్ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న జోనల్ స్థాయి క్రీడలు సోమవారం ముగిశాయి. ఈ క్రీడల్లో బాసర జోన్లోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 14 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 1200 మంది విద్యార్థినులు పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ జోనల్ స్థాయి క్రీడ పోటీల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ నిర్వహించారు. మొదటి రోజు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
శిక్షణతో క్రీడల్లో రాణింపు..
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రత్యేక శిక్షకులు విద్యార్థినులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ వంటి అవుట్డోర్ గేమ్లతో పాటు ఇండోర్గేమ్లైన హ్యాండ్బాల్, టెన్నికాయిట్, క్యారం, చెస్, షటిల్, బ్యాడ్మింటన్ వంటి 16 రకాల క్రీడల్లో శిక్షణను ఇస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు అందిస్తున్న శిక్షణలో అనేక మెళకువులను నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటుతూ రాష్ట్ర స్థాయికి ఎదుగుతున్నారు.
క్రీడలు మనిషికి ఎంతో అవసరం
సోన్, అక్టోబర్ 16: క్రీడలు మనిషికి ఎంతో అవసరమని సోన్ ఎంపీడీవో మోహన్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం మండలం లెఫ్ట్పోచంపాడ్ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న తొమ్మిదో జోనల్ స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో, ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటల వల్ల చదువుపై ఏకగ్రత పెంచుతోందని దీంతో విజయవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పలువురిని అబ్బురపరిచారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 14 విద్యాలయాల నుంచి 1190 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. అండర్-14, 17, 19 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గెలుపొందిన జట్లు ఇవే….
కబడ్డీ : అండర్-14లో కడెం (ప్రథమ), కంజర(ద్వితీయ), అండర్-17లో భైంసా(ప్రథమ), ధర్మారం(ద్వితీయ), అండర్ -19 ధర్మారం(ప్రథమ), లెఫ్ట్ పోచంపాడ్(ద్వితీయ)
ఖోఖో: అండర్ -14లో ధర్మారం (ప్రథమ), రైట్ పోచంపాడ్(ద్వితీయ), అండర్-17లో ధర్మారం (ప్రథమ), బోథ్(ద్వితీయ), అండర్-19లో రైట్ పోచంపాడ్ (ప్రథమ), కడెం (ద్వితీయ)
వాలీబాల్: అండర్-17లో సుద్దపల్లి (ప్రథమ), లెఫ్ట్ పోచంపాడ్ (ద్వితీయ), అండర్-19లో కంజర (ప్రథమ), రైట్ పోచంపాడ్ (ద్వితీయ)
బాల్బ్యాడ్మింటన్: అండర్-17లో ధర్మారం (ప్రథమ), నవీపేట్ (ద్వితీయ), అండర్-19లో నవీపేట్ (ప్రథమ), ధర్మారం(ద్వితీయ)
హ్యాండ్బాల్: అండర్-17లో ధర్మారం (ప్రథమ), సుద్దపల్లి (ద్వితీయ), అండర్-19లో సుద్దపల్లి (ప్రథమ), ధర్మారం (ద్వితీయ)
టెన్నికాయిట్: అండర్-14లో ధర్మారం (ప్రథమ), సుద్దపల్లి (ద్వితీయ), అండర్-17లో ధర్మారం (ప్రథమ), జాం(ద్వితీయ), అండర్-19లో ధర్మారం(ప్రథమ), రైట్ పోచంపాడ్ (ద్వితీయ)
చెస్: (సింగిల్) అండర్-14లో డీ అర్చన (కడెం), జీ రక్షిత (ధర్మారం), అండర్-17లో ఇ వనజ (ఆర్మూర్), సీహెచ్.శ్రావిక (జగిత్యాల), అండర్-19లో జే శ్రీనిక (ధర్మారం), ఎన్ పద్మ (జగిత్యాల)
క్యారం డబుల్: అండర్-14లో సీహెచ్ హర్షిణి, నందిత (సుద్దపల్లి), సీహెచ్ సింధు, అద్విత (ధర్మారం), అండర్-17లో భవాని, సలోమి (ఆదిలాబాద్), అండర్-19లో లక్ష్మిప్రసన్న, ఇంద్రభవాని (సుద్దపల్లి), చందన, ఆర్ వర్ష (బోథ్)లు గెలుపొందారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సరస్వతి, వైస్ ప్రిన్సిపాల్ ప్రేమలత, క్రీడల నిర్వాహకులు నీరజ, జయశీల, అసోసియేషన్ల బాధ్యులు అన్నపూర్ణగౌడ్, జమున, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు
మాది సోన్ గ్రామం. నేను గురుకుల పాఠశాలల్లో మొదటగా చదువుతున్నప్పుడు క్రీడలపై అంతగా ఆసక్తి చూపలేదు. ఉపాధ్యాయులు, పీఈటీ సార్లు క్రీడల్లో పాల్గొనాలని ప్రోత్సాహించారు. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ వాలీబాల్పై ఆసక్తి పెంచుకున్నాను. బోథ్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో వాలీబాల్ క్రీడల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో నైపుణ్యం సాధించాను. మున్ముందు కాలంలో వాలీబాల్ క్రీడల్లో కోచ్గా ఎదుగాలన్నదే ప్రధాన ఆశయం.
-సింగాపురం అమూల్య, పదో తరగతి విద్యార్థిని, లెఫ్ట్ పోచంపాడ్
చదువుతో పాటు క్రీడలు ముఖ్యం
చదువుతో పాటు క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరం. ఆటల్లో రాణించడంతో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగపడతాయి. లెఫ్ట్పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన జోనల్ స్థాయి మీట్లో 1190 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలు మనిషికి ఎంతో అవసరమం.
-నీరజారెడ్డి, రీజనల్ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్