బోథ్, జనవరి 6 : పల్లెలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పంచాయతీలకు శాశ్వత, పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 500 జనాభా కలిగి ఉన్న గిరిజన తండాలు, పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కానీ పక్కా భవనాలు లేక అరకొర సౌకర్యాలతో అద్దె గదుల్లో కాలం వెల్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగానే మండలంలో ఏడు నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
ఒక్కో పంచాయతీ భవనానికి రూ.25లక్షలు
బోథ్ మండలంలో మొత్తం 33 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా ఏర్పాటైన ఏడు గ్రామ పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాభివృద్ధి కమిటీ వారు సమకూర్చిన భవనాలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో గుర్రాలతండా, గుట్టపక్కతండా, కోటా(కే), లంబాడితండా, మందబొగూడ, నక్కలవాడ, సాంగ్వి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో పంచాయతీ భవనానికి రూ 25లక్షలు వెచ్చిస్తూ అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్నారు. వీటిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్టోర్రూం, సమావేశమందిరం, కంప్యూటర్ గది, మల్టీపర్పస్రూం, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలతో కొత్త భవనాలు రూపుదిద్దుకోనున్నాయి. కొత్త జీపీలకు భవనాలు మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాధలు తీరిపోనున్నాయి
కొత్తగా ఏర్పాటైన మందబొగూడ గ్రామ పంచాయతీ కార్యకలాపాలు పాఠశాల పాత భవనంలో నిర్వహిస్తున్నాం. గదులు సరిపోకున్నా సమావేశాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో మా బాధలు తీరిపోనున్నాయి. కావాల్సిన భవనం అందుబాటులోకి రానుంది.
– ఆడె చాంగుబాయి, సర్పంచ్, మందబొగూడ
అంగన్వాడీ కేంద్రంలో కార్యకలాపాలు..
నక్కలవాడ గ్రామ పంచాయతీ కార్యకలాపాలు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నాం. కొత్తగా జీపీ ఏర్పాటైనా పల్లెలో కావాల్సిన భవనం అందుబాటులో లేక పోవడంతో అంగన్వాడీ కేంద్రంలో ఇబ్బందిగా ఉన్నా నడిపిస్తున్నాం. ప్రభుత్వం జీపీకి కొత్త భవనం మంజూరు చేయడంతో సంతోషంగా ఉంది. నిర్వహణ సులభం కానుంది.
– కొడప విజయ్, సర్పంచ్, నక్కలవాడ