ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పకడ్బందీగా సర్వే పూర్తి చేసి అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించింది. మరో వారంలో డివిజినల్ స్థాయి కమిటీ, ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీ సమావేశాల్లో చర్చించి హక్కులు కల్పించనున్నది. జిల్లా వ్యాప్తంగా 51,859 ఎకరాలకు 13,177 మంది గిరిజన, 44,267 ఎకరాలకు 13,503 మంది గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలించి ఆధారాలను బట్టి పట్టాలివ్వనున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పోడు భూముల సమస్యల పరిష్కారం కొలిక్కివస్తున్నది. అర్హులైన పోడు రైతులందరికీ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. భూముల ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అటవీ, రెవె న్యూ, గిరిజన శాఖల అధికారులు మండల స్థా యి కమిటీల ద్వారా సర్వేలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 51,859 ఎకరాలకు సంబంధించి 13,177 మంది గిరిజన, 44,267 ఎకరాలకు పట్టాల కోసం 13,503 మంది గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకున్నారు. గిరిజనులు అటవీ హక్కుల చట్టాన్ని అనుసరించి 2005 డిసెంబర్ 30 నాటికి పోడు సాగులో ఉన్నట్లు ఆధారాలను చూపించిన వారు అర్హులు కాగా, గిరిజనేతరులు మాత్రం 1930 నుంచి అంటే మూడు తరాలుగా భూములు సాగు చేస్తుకుంటున్నట్లు ఆధారాలు చూపిస్తే అర్హులు.
జీపీఎస్ ద్వారా సర్వేలు..
పోడు భూముల సర్వేల కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక సాఫ్ట్వేర్లతో కలిగిన జీపీఎస్ ద్వారా సర్వేలు నిర్వహించారు. 2005 డిసెంబర్కంటే ముందున్న గూగుల్ మ్యాప్లతో పాటు ప్రస్తుత గూగుల్ మ్యాప్ల ఆధారంగా భూములను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా ఎస్డబ్ల్యూ అనే సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించే ఈ విధానంతో భూమి యొక్క స్వభావం పూర్తిగా తెలిసిపోతుంది. 2005 కంటే ముందు అక్కడ అడవి ఉండేదా లేక సాగులో ఉండేదా అనే విషయాలు ఆన్లైన్ ద్వారా నమోదవుతాయి. ఒకవేళ అటవీ భూమి అయితే ఫారెస్ట్ కంపార్ట్మెంట్తో సహా చూపిస్తుంది. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సేకరించిన పూర్తి వివరాలను డివిజనల్ స్థాయి కమిటీకి నివేదించారు.
భవిష్యత్లో వివాదాలు రాకుండా..
జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న రైతులకు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 2005 డిసెంబర్ కంటే ముందు నుంచి గిరిజన రైతులు సాగులో ఉన్నట్లు ఏదైనా ఆధారాలు చూపిస్తే పట్టాలు ఇవ్వనున్నారు. పోడుభూముల విషయంలో అటవీ – రెవెన్యూ శాఖల మధ్య కూడా భవిష్యత్తులో ఎలాంటి విభేదాలకు తావురాకుండా అధికారులు సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన భూ వివాదాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గిరిజనేతరులు 1930 నుంచి సాగులో ఉన్నట్లు ఆధారాలు చూపించడం కష్టంగా మారింది. 1930 కంటే ముందు రికార్డులు రెవెన్యూ వారి వద్ద కూడా లభించడం లేదని తెలుస్తోంది. మూడు తరాలుగా భూములు సాగుచేసుకుంటున్నట్లు ఆధారాలు దొరకడం లేదని పలువురు గిరిజనేతర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.