తాంసి : జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బుధవారం నిర్వహించిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 81వ వర్ధంతి వేడుకల్లో మాజీ ఎంపీ గోడం నగేశ్తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసులకు జల్జంగిల్ జమీన్కోసం పోరాడిన యోధుడు కొమురంభీం అన్నారు. మాజీ ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ నిజాం సర్కారును ఎదిరించి పోరాడిన యోధుడు కొమురం భీం అన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. దండారి ఉత్సవాలకు జిల్లాకు రూ.కోటి కేటాయించడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు సీడాం రాంకిషన్, కుర్సింగే తానాజీ, మెస్రం కృష్ణ, గోడం గణేశ్, నగేశ్, సంగెపు ఈశ్వర్, దేవన్న, రమణ, తదితరులు పాల్గొన్నారు.