నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం గాదిగూడ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ఎంపీపీ ఆడా చంద్రకళ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల శాఖ అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మండల ప్రగతిని వివరించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడారు..దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని, ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో గాదిగూడ మండలాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా సహకారించా లన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద ఆడబిడ్డలకు ఎంతో అండగా నిలుస్తుందన్నారు. అనంతరం 20మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ఆర్కా మోతిరామ్, ఎంపీడీవో రామేశ్వర్, వైస్ ఎంపీపీ యోగేశ్, ఎంపీవో సాయిప్రసాద్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు జాడి లింగన్న, శ్రీనివాస్, రాథోడ్ సునీల్, ఎంఈవో రాపెల్లి ఆశన్న,ఏపీఎం మాధవి, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, ఏవో జాడి దివ్య, ఆయాశాఖల అధికారులు, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.