ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు వైద్యం ప్రజలకు చేరువైంది. ప్రధానంగా గ్రామీణ పేదలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారిని కూడా పల్లెల్లోని సర్కారు దవాఖానల్లో డాక్టర్లు నయం చేస్తున్నారు. గతంలో గర్భిణులు ప్రసవాలకు పట్టణాల్లోని ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూపాయలు ఖర్ఛు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు తమ గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలు చేయడంతోపాటు డెలివరీలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందుతుండడంతో చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్సెంటర్లను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఆదిలాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు సక్రమంగా అందేవి కావు. దీంతో గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యానికి పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి భారీగా డబ్బులు ఖర్చు చేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పేదల వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్సెంటర్ల ద్వారా ప్రజలు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నది. జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో ఇటీవల ప్రభుత్వం 25 మంది యువ డాక్టర్లను నియమించింది.
మారుమూల గ్రామాల ప్రజలకు పీహెచ్సీ సబ్సెంటర్స్ ద్వారా వైద్యులు, సిబ్బంది వైద్యసేవలు అందిస్తారు. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు ఉండగా 126 సబ్సెంటర్లు ఉన్నాయి. పీహెచ్సీల్లో గర్భిణులకు స్కానింగ్, వివిధ వ్యాధుల నిర్ధారణలో భాగంగా రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లాంటి వ్యాధులను నయం చేస్తున్నారు. సర్కారు దవాఖానల్లో మె రుగైన వైద్యసేవలు అందుతుండడంతో ఇక్కడికి వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 40 సబ్సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల సంఖ్య 166కు చేరనున్నాయి.
అంకోలి పీహెచ్సీ పరిధిలో ఇప్పటికే 13 సబ్సెంటర్స్ ఉండగా కొత్తగా ఏడు కేఆర్కే కాలనీ, పిట్టలవాడ, తంతోలి, న్యూ హౌసింగ్బోర్డు, టీచర్స్కాలనీ, సుభాష్నగర్, బంగారిగూడలో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. బేల పీహెచ్సీ పరిధిలో ప్రస్తుతం నాలుగు ఉప కేంద్రాలు ఉం డగా.. కొత్తగా రెండు డోప్తాల, మసాల(బి)లో.. గుడిహత్నూర్ పీహెచ్సీ పరిధిలో ప్రస్తుతం ఏడు ఉండగా కొత్తగా రెండు గుడిహత్నూర్ నార్త్, మాన్కాపూర్లలో ఏర్పాటు చేయనున్నారు.
జైనథ్ పీహెచ్సీ పరిధిలో ప్రస్తుతం ఐదు ఉండగా కొత్తగా బలాన్పూర్లో.. సైద్పూర్ పీహెచ్సీ పరిధిలో మూడు ఉండగా కొత్తగా రెండు చాంద్పల్లి, దుబ్బగూడ.. తలమడగు పీహెచ్సీ పరిధిలో ఏడు ఉండగా కొత్తగా మూడు పల్లి(బీ), సుంకిడి, రుయ్యాడిలో.. బజార్హత్నూర్ పీహెచ్సీ పరిధిలో ఏడు ఉండగా కొత్తగా రెండు దహెగా, భూతాయి(బీ).. ఇచ్చోడ పీహెచ్సీ పరిధిలో ప్రస్తుతం ఆరు ఉండగా కొత్తగా మూడు ఇచ్చోడ నార్త్, అడెగాం, పొన్నలో.. నర్సాపూర్ (టీ) పరిధిలో ఇప్పటికే ఐదు ఉండగా కొత్తగా గుండాల, సోనపల్లి.. నేరడిగొండ పీహెచ్సీలో ఏడు ఉండగా కొత్తగా రెండు కొరిటకల్(బీ), కుంటాల(కే)లో ప్రతిపాదించారు.
సోనాల పీహెచ్సీ పరిధిలో పదకొండు ఉండగా కొత్తగా నాలుగు సోనాల-2, సూర్యనగర్, సాయినగర్, బోథ్-2.. గాదిగూడ పీహెచ్సీలో ప్రస్తుతం మూడు ఉండగా కొత్తగా తోయగూడ.. దంతనపల్లి పీహెచ్సీ పరిధిలో ఐదు ఉండగా కొత్తగా రెండు కొత్తగూడ(జీ), గంగన్నపేట.. హస్నాపూర్ పీహెచ్సీలో నాలుగు ఉండగా కొత్తగా రెండు ఎక్స్రోడ్, కన్నాపూర్.. శ్యాంపూర్ పీహెచ్సీలో నాలుగు ఉండగా కొత్తగా ఒకటి లక్షిటిపేట.. ఇంద్రవెల్లి పీహెచ్సీలో ఆరు ఉండగా కొత్తగా గట్టెపల్లి.. పిట్టబొంగరం పీహెచ్సీలో నాలుగు ఉండగా కొత్తగా రెండు కన్నాపూర్, భిక్కుతండా.. నార్నూర్ పీహెచ్సీలో నాలుగు ఉండగా కొత్తగా ఒకటి బాబేఝరిలో ఉపకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.