ఖానాపూర్ రూరల్, ఏప్రిల్ 11 : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సవాలు విసురుతున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నా యి. ఖానాపూర్ మండలం మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. సుమారు రూ.1.49 కోట్లతో పాఠశాల భవన నిర్మాణాలు సాగుతున్నాయి. మస్కాపూర్లో భవన నిర్మాణం 30 శాతం పూర్తి కాగా, రూ.6.26 లక్షలతో చేపట్టిన ప్రాథమిక పాఠశాల పనులు వంద శాతం పూర్తయ్యాయి. సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి, అవసరమైన మరమ్మతులు, విద్యుత్ సాకర్యం, ఫర్నిచర్, గ్రీన్ చాక్పీస్ బోర్డుల ఏర్పా టు, ప్రహరీ, అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్ నిర్మాణం, పెయింటింగ్, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వి ద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూపురేఖలు మారాయి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని తెచ్చింది. దీంతో గ్రామాల్లో చదువుకు దూరమయ్యే పిల్లలు సైతం బడుల్లో చేరి విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం సర్కారు బడుల్లో చేరుతున్నారు. మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో 600పై చిలుకు విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్కు పునాది వేస్తున్నారు. ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నాం. ఇంతకుముందు నిర్మించిన తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయి. ‘మన ఊరు-మన బడి’లో నిర్మించే పాఠశాల భవనంలో విశాలమైన గదులతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
– జాడి శ్రీనివాస్, ఉపాధ్యాయుడు
సకల సౌకర్యాలు
‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యలు కల్పిస్తున్నది. మస్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో రూ.6.26 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పాఠశాలలో మరమ్మతులు ఇప్పటికే వందశాతం పూర్తయ్యాయి. మైనర్, మేజర్ పనులతో పాటు విద్యుత్, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. పాఠశాలలో 186 విద్యార్థులకు అన్ని సౌకర్యాలతోపాటు నాణ్యత గల విద్యను అందిస్తున్నాం. తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– లింగమూర్తి, ఉపాధ్యాయుడు
పనులు వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. మండలంలో ఎంపికైన ఆయా పాఠశాలల్లో పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నాం. పాఠశాల పనులు పూర్తి నాణ్యతతో చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే పనులు మూడు దశల్లో సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో 30 శాతం పనులు జరుగగా.. ప్రాథమిక పాఠశాలల్లో వంద శాతం పూర్తయ్యాయి. రేపోమాపో ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
– మధుసూదన్, ఎంఈవో