నార్నూర్/బజార్హత్నూర్/బేల, మే 21 : ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నది. పల్లెల్లో బుధవారం నుంచి ప్రారంభమైన పారిశుధ్య వారోత్సవాల్లో వారం రోజుల పాటు పరిశుభ్రత పనులు కొనసాగించనున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఎంపీవోల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య వారోత్సవాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న వానకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో 48, బజార్హత్నూర్ మండలంలో 30, బేల మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలు పంచాయతీలకు ప్రతి నెలకు కేటాయించిన నిధులతో గ్రామంలో అవసరమున్న పనులకు పంచాయతీలు వినియోగిస్తున్నాయి.
పల్లెల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏటా వానకాలం ముందు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులు 16 రోజులుగా సమ్మె చేయడంతో గ్రామాల్లో పారిశుధ్యంపై కొంత ప్రభావం పడింది. రోజూ ఉదయం వారు గ్రామానికి వెళ్లి కార్మికులతో పారిశుధ్య పనులు చేయించేవారు. సమ్మె కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది. నార్నూర్, గాదిగూడలోని అన్ని పంచాయతీల్లో కలిపి 120 మంది, బజార్హత్నూర్ మండలంలో 80 మంది, బేల మండలంలో 115 మందిపారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో వీరు ప్రత్యేక కార్యాచరణలో భాగస్వాములవుతున్నారు. వారోత్సవాలను మండల ప్రత్యేకాధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. నీటి నిల్వతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించాం. ఇళ్లు, ట్యాంకులను శుభ్రం చేయడంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యేక కార్యాచరణ అమలుపై గ్రామాల వారీగా పర్యవేక్షిస్తున్నాం. -స్వప్నశీల, ఎంపీవో, నార్నూర్
ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించి గ్రామాల్లో చెత్త తొలగింపు, వ్యర్థాల తరలింపు వంటి పనులు నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామాల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షస్తున్నాం. వానకాలంలో వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
– మహేందర్రెడ్డి, ఎంపీవో, బజార్హత్నూర్
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే కావకాశం ఉన్నందున ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేశాం.
మహేందర్ కుమార్, ఎంపీడీవో బేల