జ్వరమొచ్చి.. నొప్పొచ్చి.. జలుబు చేసి జబ్బు తీవ్రత అధికమైతే హైరానా పడి జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. వర్షాకాలంలోనైతే వాగులు, వంకలు దాటడం, రాళ్లురప్పలపై నుంచి మోకాలులోతు బురద నీటిలో నుంచైనా వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రాణాలు పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇటువంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా.. శిథిలావస్థలో ఉన్న వాటిని మరమ్మతులు చేయడం, కొత్త వాటిని నిర్మించడం చేస్తున్నది. రూ.11.40 కోట్లతో నూతన ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మిస్తున్నది. ఇవీ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే స్థానికంగా పేదలకు మెరుగైన వైద్యం అందనున్నది.
మంచిర్యాల, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 400లకు పైగా ఉన్న హెల్త్ సబ్ సెంటర్లను పునరుద్ధరిస్తున్నది. ఇప్పటికే 146 కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేసి పునర్మిస్తున్నది. తాజాగా.. మంచిర్యాల జిల్లాలో 39, నిర్మల్లో 2 సెంటర్లకు కొత్త భవనాలు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.11.40 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవేకాకుండా మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇప్పటికే రూ.29.96 కోట్లతో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ల పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగు పడడమే కాకుండా.. పేదలకు ఉపయోగపడనున్నాయి.
పేదలకు అత్యుత్తమ వైద్యం
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యుత్తమ వైద్య విధానాన్ని తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్నది. ప్రతి దానికి పెద్దాసుపత్రులపై ఆధారపడకుండా గ్రామాల్లోనే మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో హెల్త్ సబ్ సెంటర్లను బాగు చేస్తున్నది. ఇందులో నిపుణులైన వైద్య సిబ్బందిని నియమిస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 101, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 108, నిర్మల్లో 102, ఆదిలాబాద్లో 126 సబ్ సెంటర్లు ఉండగా.. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్లన్నింటినీ హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చింది. వాటికే ఇప్పుడు కొత్త బిల్డింగ్లు నిర్మిస్తున్నది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ను ఈ సెంటర్లలో అందుబాటులో పెడుతున్నది.
ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ బ్రిడ్జి కోర్సు, స్థానిక ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉంటారు. ఇక్కడే ప్రథమ చికిత్స చేస్తారు. పేషంట్ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మాత్రమే దగ్గరలోని పీహెచ్సీ, అక్కడి నుంచి జిల్లా దవాఖానకు పంపిస్తారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 34 చోట్ల కొత్త సెంటర్లు నిర్మిస్తుండగా.. తాజాగా మరో 39 మంజూరయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 45 చోట్ల కొత్త బిల్డింగ్లు నిర్మిస్తుండగా.. తాజాగా రెండు మంజూరయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్లో 39 భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది.
నిధులు మంజూరైన 41 సెంటర్లు ఇవే..
గత రెండు విడుతల్లో కాకుండా ఈసారి 41 సెంటర్లకు నిధులు మంజూరయ్యాయి. మంచిర్యాల జిల్లాలో అలిగాన్, షెట్పల్లి, ఆర్కే-6, ఎస్ఎం పల్లి, కృష్ణ కాలనీ, సుందరయ్య కాలనీ, సీసీసీ సన్పూర్, నస్పూర్ కాలనీ, కొత్తూరు, లక్షెట్టిపేట, ఇట్యాల, కేదర్శాల, సోమన్పల్లి, ఇందారం, ముల్కల్ల, కుషన్పల్లి, కోనంపేట్, తిమ్మాపురం, జెండా వెంకటాపూర్, నర్సాపూర్, గుడిరేవు, అంగ్రాజ్పల్లి, కుందారం, నంనూర్, హాజీపూర్, నెన్నెలలో కొత్త సెంటర్లు నిర్మించనున్నారు. నిర్మల్ జిల్లాలో అభంగపట్నం, ముథోల్లో కొత్త సెంటర్లు రానున్నాయి.