మంచిర్యాల అర్బన్, జనవరి 19 : ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో రెండేండ్ల కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం బ్రిడ్జి కోర్సుల రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉండే సీట్లలో ఐదు శాతం వరకు ఎల్పీ (లిటరల్ ఎంట్రీ ఇన్టూ పాలిటెక్నిక్) సెట్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు కేటాయించనున్నది.
పాత జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ఐటీఐలలో బ్రిడ్జి కోర్సుకు నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నది. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. మొదట థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలతో అర్హులను ఎంపిక చేసి, తర్వాత ఎల్పీ సెట్లో సాధించిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ సెకండియర్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నది.
పాలిటెక్నిక్ విద్య అభ్యసించిన విద్యార్థులు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఐటీఐ పూర్తి చేసిన వారికి ఆపరేటర్లుగా తీసుకుంటే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారికి సూపర్వైజర్లుగా అవకాశాలు దక్కుతాయి. ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్, రోడ్లు భవనాల శాఖ, టీఎస్ఆర్టీసీ, టీఎస్ జెన్కో తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
– మంగనూరి చందర్, కన్వీనర్/ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, మంచిర్యాల
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ(ఎన్సీవీటీ)లలో రెండేండ్ల కోర్సును 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్ సెకండియర్లో చేరేందుకు అర్హులు. బ్రిడ్జి కోర్సు సెషన్ 2024-25లో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ఉంటుంది.