నార్నూర్, జనవరి 18 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం ఇటీవల ప్రమాద బీమా పరిహారం రెట్టింపు చేసింది. కూలీలు పని చేసే ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే..ఆ కుటుంబానికి అందించే పరిహారం పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశాయి. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి హామీ కూలీలతోపాటు బాధిత కుటుంబానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. సాధారణంగా మట్టి పెళ్లలు విరిగి పడడం, పనిముట్లు తగిలి కూలీలకు గాయాలవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత కూడా పడుతుంటారు. ఇదే కాకుండా కూలీలకు వడదెబ్బ, పాముకాటు, గుండెపోటు తదితర ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీటితో పాటు చనిపోయినా పరిహారం అందుతుంది.
ప్రమాద బీమా సాయం ఇలా…
నార్నూర్, గాదిగూడ మండలాల్లో 48 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 14,478 జాబ్కార్డులు ఉండగా, 9,459 మంది కూలీలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఏడాదికో కూలీ వంద రోజుల పని దినాలుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా కందకాలు తవ్వడం, చెరువుల్లో పూడికతీత, కాల్వల మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం, నర్సరీల్లో గడ్డి తొలగింపు, కందకాల తవ్వకం, నర్సరీల్లో మొక్కల పెంపకం, హరితహారంలో మొక్కల సంరక్షణ, వాటికి నీళ్లు పట్టడం, శ్మశాన వాటికలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం, పంట పొలాల్లో పూడికతీత, మట్టిరోడ్ల నిర్మాణాలు, భూ అభివృద్ధి పనులు ఈజీఎస్ కూలీలు చేస్తుంటారు. ఈ పనులు చేస్తున్న కొన్ని సమయాల్లో కూలీలు గాయాలవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కూలీలకు బీమా పరిహారంగా గతంలో రూ.25వేలు చెల్లించే వారు. ప్రస్తుతం రూ.50వేలకు పెంచారు. చికిత్సకు అయ్యే ఖర్చు ఆధారంగా రూ.లక్ష వరకూ చెల్లించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అంగవైకల్యం కలిగితే గతంలో రూ.50వేలు చెల్లించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు. ప్రమాదంలో ఛాతి, గుండెనొప్పి, వడదెబ్బతో మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.50 వేలు చెల్లించే వారు. ప్రస్తుతం రూ. 2 లక్షలకు పెంచారు. బీమా పరిహారం పెంపుతో ఉపాధి కూలీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలు ప్రమాదాలకు గురైతే ప్రభుత్వం అందించే పరిహారం పెంచడం హర్షణీయం. అనుహ్య సంఘటన జరిగి ప్రమాదానికి గురైతే ప్రభుత్వం అందించే పరిహారం ఎంతోకొంత వరకు బాధిత కుటుంబానికి ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ పరిహారం పెంచడం సంతోషంగా ఉంది.
-మెస్రం దేవ్రావ్. కూలీ, మాన్కాపూర్
కూలీలకు ప్రయోజనం..
ఈజీఎస్ కూలీలకు పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే వారికి చెల్లించే పరిహారం రెట్టింపు చేశారు. దీని ద్వారా కూలీలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా పని చేస్తున్న చోట ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. వేసవిలో అయితే కూలీలు ఎక్కువగా హాజరవుతారు. ప్రభుత్వం బీమా రెట్టింపు చేయడం మంచిదే.
-పవార్ నితిన్, ఈజీఎస్ ఏపీవో, గాదిగూడ మండలం