ఖానాపూర్, జూలై 6 : మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తే, వాటిని ఆ శాఖలో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు స్వాహా చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లే(నడింపల్లే) గ్రామంలో స్త్రీనిధి రుణాల రికవరీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆడిట్లో వెల్లడైంది. గ్రామానికి చెందిన పలువురు మహిళా సంఘాల సభ్యులు తమ రుణాలను పూర్తిగా చెల్లించినప్పటికీ బకాయిలు ఉన్నట్లు అధికారులు చెప్పడం, రుణాల చెల్లింపుల రశీదులు ఉన్నప్పటికీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆడిట్ బృందం రెండు రోజులపాటు గ్రామంలోని వీవో సంఘ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. రికార్డులు, నగదు లావాదేవీలు, స్వయం సహాయక సంఘాల వివరాలు సేకరించగా.. నగదును ఖాతాల్లో జమ చేయకుండా వీవోఏ దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సోషల్ ఆడిట్ బృందం పరిశీలనలో 2021 నుంచి 2025 వరకు స్త్రీనిధి రుణాల వసూళ్లు, నగదు జమ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ కాలంలో మహిళా సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసిన నగదులో పెద్ద మొత్తం సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడం, కొన్ని రుణ చెల్లింపులు రికార్డుల్లో నమోదు కాకపోవడం, నగదు లెకల్లో భారీ వ్యత్యాసాలు ఉండడం వంటి అంశాలను ఆడిట్ బృందం గుర్తించినట్లు తెలిసింది.
రూ.16 లక్షల నగదు గల్లంతు
రూ.16 లక్షలకు పైగా నగదు గల్లంతైనట్లు ఆడిట్ అధికారులు గుర్తించినట్లు స్రీనిధి ఆర్ఎం సరిత తెలిపారు. ఈ వ్యవహారంపై కలెక్టర్, పీడీకి నివేదిక అందజేస్తామన్నారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలతోపాటు అవసరమైతే అర్అర్యాక్ట్(రెవెన్యూ రికవరీ) ప్రయోగించి డబ్బులు రికవరీ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశముందన్నారు. దుర్వినియోగమైన నిధులను వెంటనే రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. గ్రామసభలో సర్పంచ్ కొక్కుల సుభద్ర, ఏపీఎం మల్లేశ్, అసిస్టెంట్ మేనేజర్ మహేందర్ పాల్గొన్నారు. ఈ విషయమై వీవోఏను అడుగగా.. తాను స్రీనిధి డబ్బులు సంబంధిత సంఘ సభ్యుల నుంచి వసూలు చేసి అసిస్టెంట్ మేనేజర్కు ఇచ్చానని, నాకు ఎలాంటి రశీదు ఇవ్వలేదని తెలిపాడు.