నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని గణనాథులు కొలువుదీరాయి. బుధవారం వినాయక చవితి సందర్భంగా కూడళ్లు, ఆలయాలు, పురవీధుల్లో ఏర్పాటు చేసిన ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. భాజాభజంత్రీల మధ్య యువత, మహిళలు నృత్యాలు చేస్తూ వినాయకులను తీసుకొచ్చారు. విద్యుద్దీపాలు, సెట్టింగ్స్ అదరహో అనిపిస్తున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తులు సతీసమేతంగా పూజలు చేశారు. విఘ్నేశ్వరుడిని మట్టి, కర్ర, గోమయంతో తయారు చేయగా.. లింగాకారం, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, మార్కండేయుడు ఇలా విభిన్న రూపాల్లో కనువిందు చేస్తున్నాడు.. నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్లో గల తన నివాసంలో ప్రతిష్ఠించిన గోమయ గణేశుడికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు.. ఆయా మండపాల వద్ద ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు.
నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 1 : వినాయక నవరాత్రోత్సవాలు ఉమ్మడి జిల్లాలో కనుల పండువగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో బొజ్జగణపయ్య ప్రతిమలు బుధవారమే కొలువుదీరాయి. మేళతాళాలు, నృత్యాల మధ్య విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఒక్కోచోట ఒక్కో రూపంలో దర్శనమిస్తుండగా, భక్తిగీతాలు, భజనలతో ఊరూవాడా మారుమోగుతోంది. పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారుల కృషితో గతంలో కంటే మట్టి వినాయక ప్రతిమలే ఎక్కువగా కనిపించాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్లోని తన నివాసంతో గోమయ గణేషుడి ప్రతిమకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తన సతీమణి విజయలక్ష్మితో కలిసి పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కినట్లు తెలిపారు. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకుడిని దర్శించుకున్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి ప్రతిమకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పూజలు చేశారు. ఆదిలాబాద్లోని కుమార్పేట్లో జిల్లాలోనే అత్యంత భారీ విగ్రహం నెలకొల్పగా, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూజలు నిర్వహించారు. వినాయక్ చౌక్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన సతీమణి రమా, ఆసిఫాబాద్లోని తన నివాసంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాలలోని విశ్వనాథ స్వామి దేవాస్థాన కల్యాణ మండపంలో పట్టణ ఆర్యవైశ్య, వాసవీ ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద ఎమ్మెల్యే దివాకర్రావు పూజలు చేశారు. కాసిపేట మండల కేంద్రంతో పాటు బెల్లంపల్లిలోని 18వ వార్డు, పోస్టాఫీస్ బస్తీలోని మండపాల వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూజలు నిర్వహించారు.