ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 28: గణపతి బప్పా..మోరియా, జై బోలో గణేశ్ మహారాజ్కీ జై.. అంటూ నినాదాలతో గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపారు. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం కనుల పండువగా సాగింది. బ్యాండు మేళాల మధ్య యువత, చిన్నారులు నృత్యాలు చేశారు. పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయక చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్లో భారీ లైట్ల సెట్టింగ్లు కనువిందు చేశాయి. ఆదిలాబాద్లోని కుమార జనత గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 48 అడుగుల వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రతిష్ఠించిన స్థలంలోనే నిమజ్జనం చేయడం విశేషం.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 28 : జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి లడ్డుని వేలం వేశారు. 21కేజీల లడ్డుని దక్కించుకునేందుకు ఔత్సాహికులు పాల్గొనగా వేలం హోరాహోరీగా సాగింది. రూ.5వేల నుంచి ప్రారంభమైన ఈ వేలం చివరకు పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.లక్ష 2 వేలకు దక్కించుకున్నాడు. అనంతరం యువకుడిని మండప సభ్యులు శాలువాతో సన్మానించారు.
బేల, సెప్టెంబర్ 28 : మండల కేంద్రంతో పాటు దహిగాం, కొగ్దూర్, చప్రాల, సిర్సన్న, డోప్టాల గ్రామాల్లో గణనాథుని శోభాయాత్ర గురువారం ఘనంగా సాగింది. డప్పుచప్పుళ్ల మధ్య యువకులు, చిన్నారులు, గ్రామస్తులు నృత్యాలు చేశారు. గ్రామాల సమీపంలోని వాగులు, చెరువుల్లో గణనాథులను నిమజ్జనం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు రాకేశ్, భూమన్న, యువకులు పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 28 : ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయక్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, గిరిజన నాయకుడు వెడ్మా బొజ్జు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గణనాథుల శోభాయాత్ర ప్రారంభమైంది. పట్టణంలో కొలువు దీరిన 45 గణేశ్ విగ్రహాల వద్ద యువకులు డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. వినాయక్చౌక్ మీదుగా పోచమ్మవాడ ద్వారా గంగన్నపేట్ చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, సీఐ రామకృష్ణ, ఎస్ఐ మనోహర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఠాకూర్ గోపాల్ సింగ్, ప్రధాన కార్యదర్శి బింగి వెంకటేశ్, నాయకులు, హిందూ ఉత్సవ సమితి నాయకులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), సెప్టెంబర్ 28 : సిరికొండ మండలం రాంపూర్ గ్రామంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు భజన చేస్తూ, మహిళలు కోలాటాలు ఆడారు. చిక్మాన్ వాగులో నిమజ్జనం చేశారు.
నార్నూర్, సెప్టెంబర్ 28 : మండలంలోని గ్రామాల్లో గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు. గణనాథుని విగ్రహాలను చెరువులు,వంకల్లో నిమజ్జనం చేశారు. తాడిహత్నూర్లో షాదుల్లాఖాన్లో అన్నదానం చేశారు.