ఆదిలాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తింటాడని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కంది శ్రీనివాస్రెడ్డి నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని హితువుపలికారు. ప్రజా సేవ ముసుగులో ప్రజలను దోచుకునేందుకు వచ్చిన వ్యక్తి అన్నారు. గతంలో బీజేపీలో ఉన్న కంది కమలం పార్టీ అగ్రనేత సంతోష్జీ తన జేబులో ఉన్నారని, బీజేపీ టికెట్లు తాను ఇప్పిస్తానని చెప్పిన ఆయన మూడు నెలల్లో కాంగ్రెస్లో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తాము డబ్బులు తీసుకున్నానని చెబుతున్న ఆయన తన మాటలను నిరూపించుకోవడానికి ఆదిలాబాద్లో ఏ చౌరస్తాకైనా రావాలని రోజు, సమయం ఆయన నిర్ణయించాలని సవాల్ విసిరారు.
మహిళా అని చూడకుండా శూర్ఫణక్క ముక్కు కోయాలని అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గు చేటని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ప్రజల తరపున పోరాటం చేసినట్లు తెలిపారు. ప్రజా సేవ చేశానని చెప్పుకుంటున్న కంది శ్రీనివాస్ రెడ్డి కరోనా సమయంలో ఏమి చేశారని ప్రశ్నించారు. ఎంతో మంది పస్తులు ఉండి అల్లాడిన సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ఎన్ఐర్ఐలు ఎంతో మంది సేవ చేశారని గుర్తు చేశారు. శ్రీనివాస్రెడ్డి డబ్బులున్నయనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని, పార్టీ టికెట్ను, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కొనుగోలు చేసి డబ్బులతో ఏమైనా చేయవచ్చనే విధంగా డబ్బు మదంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. దొంగ కంపెనీల పేరిట దొచుకుంటున్నారని డొల్ల కంపెనీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా కంపెనీల్లో ఉద్యోగులను మోసం చేశారన్నారు. శ్రీనివాస్రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు చేయాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, సీనియర్ నాయకుడు సంజీవరెడ్డి ఉన్నారు.
బేల పోలీస్స్టేషన్లో కేసు
ఈనెల 12వ తేదీన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చెప్రాల గ్రామంలో శ్రీనివాస్రెడ్డి గ్రామస్తుల ఎదుట మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను అనుచిత పదజాలంతో దూషించడంతో ఆమె ఫిర్యాదు మేరకు బేల పోలీస్స్టేషన్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఎస్పీ డి.ఉదయ్కుమార్రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి సంజీవ్రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు.