రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 24 : గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర శనివారం రెండో రోజూ అంగరంగ వైభవంగా సాగింది. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో గ్రామ దేవతలైన తిమ్మాపూర్ నల్లపోశమ్మ, భీమన్న విగ్రహాలను అభిషేకించి శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. బొక్కల గుట్ట గ్రామం నుంచి కిలో మీటర్ దూరాన.. రాష్ట్ర రహదారి పక్కన కొలువైన గాంధారీ మైసమ్మ తల్లికి పసుపు, కుంకుమలు, కొబ్బరికాయలు, యాటపోతులతో మొక్కులు చెల్లించుకున్నారు. సదర్ల (దారి) భీమన్న వద్దనుంచి సాయంత్ర తప్పెటగూళ్లు, పిల్లనగ్రోవుల వాయిద్యాల నడుమ నాయక్పోడ్ కళాకారులు నృత్యాలు చేస్తూ.. ఊరేగింపుగా గాంధారీఖిల్లా దిగువకు గోదావరి నదీజలాలను తీసుకెళ్లారు. నాయక్పోడ్ మహిళలు అక్కడి చెలిమ నీళ్లు, 21 ఘటాల (కూరాడు కుండలు) గోదావరి జలాలను తీసుకెళ్లి ఖిల్లా ప్రథమ ద్వారం వద్ద కొలువైన కాలభైరవునికి అభిషేకం చేశారు. ఆపై కోట ప్రధాన ద్వారంపైన కొలువైన మైసమ్మ తల్లి (లక్ష్మీదేవర)ని గంగా జలంతో అభిషేకించారు. పన్నెండు తలల నాగశేషుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు, శివపార్వతుల విగ్రహాలను గంగా జలంతో శుద్ధి చేశారు.
గుట్ట దిగువన రాత్రి నుంచి తెల్లారే వరకు గిరిజన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. లక్ష్మీదేవర, కృష్ణస్వామి (శ్రీకృష్ణుడు), పోతరాజు, మదన పోచమ్మ, మాంతమ్మ, చంద్రమ్మ, పంచపాండవుల ముఖతొడుగులు ధరించి తప్పెటగూళ్లు, పిల్లనగ్రోవుల వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అర్ధరాత్రి దాటాక మైసమ్మ దేవత వద్ద పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు యాటలు బలి ఇచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు దర్శించుకుంటారు. తాండూర్ (మందమర్రి ఇన్చార్జి) సీఐ శ్రీనివాసరావు శనివారం సాయంత్రం మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో 90 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆయన వెంట రామకృష్ణాపూర్ ఎస్ఐ జీ. రాజశేఖర్ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో పూజారులు మైసయ్య,రొడ్డ పెద్దరాజం, నాయకపోడ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్, ప్రధాన కార్యదర్శి బైర్నేని లక్ష్మణ్, కోశాధికారి బత్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుండ రాజేశ్, మార్నేని భూమేశ్, తేనేని రవి, రెడ్డి లక్ష్మణ్, మేసినేని రాజయ్య, గంజి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.