కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubeer ) మండలం పార్డి (బీ) గ్రామంలో మంగళవారం విషాద ఛాయలు ( Tragedy ) అలుముకున్నాయి. సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో గ్రామానికి చెందిన జీపు డ్రైవర్ తులసిరాం తోపాటు ఆవుల గంగాధర్, తూము సాయిలు, తూము గౌరబాయి ఘటన స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు నాలుగు మృతదేహాలకు గ్రామంలోని స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు (Funeral ) నిర్వహించారు.

మృతుల కుటుంబ సభ్యులకు చెందిన బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతుల్లో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులు కాగా, వాహన డ్రైవర్ తులసీరామ్ మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు. తమ ఆత్మీయులను కడసారి చూసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటితో వీడ్కోలు పలికిన దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది.
నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ, తిరుగుతూ ఉన్న వారు నేడు విగతజీవులుగా మారడాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా విలపించారు. సర్పంచ్ మడి ప్రవీణ్, మాజీ ఎంపీపీ తూమ్ లక్ష్మి, తుమ్ రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ వి రేఖ మోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ బోయిడి విట్టల్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు శవయాత్రలో పాల్గొన్నారు.