మంచిర్యాల, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీయువకుల కలను సాకారం చేసింది. గ్రూప్స్, పోలీస్, ఇరిగేషన్ వంటి ప్రతి శాఖలో జాబ్స్కు నోటిఫికేషన్ జారీ చేయగా ప్రతిభ గల అభ్యర్థులు కొలువులు కొట్టుకున్నారు. ఉద్యోగార్థులు కూడా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రణాళికాబద్ధంగా చదివారు. ఒక్కొక్కరు ఐదారు ఉద్యోగాలు కూడా సాధించారు. రాష్ట్ర సర్కారు చొరవ తీసుకొని నిరుపేదల బిడ్డలకు ఉచితంగా భోజనం, కోచింగ్ ఇప్పించింది. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుండగా వేలాది మంది గిరిజన బిడ్డలు ఉద్యోగాలు సాధించారు. పైరవీలు, అవినీతికి తావులేకుండా జాబ్స్ ఇవ్వడంతో ఉద్యోగాలు సాధించిన వారితోపాటు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ బాగా ఉపకరించడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించాయి.
సమాఖ్య పాలనలో ఉద్యోగాలు రాక దగా పడ్డం. ప్రత్యేక తెలంగాణ వస్తేనే మనోళ్లకు సర్కార్ కొలువులస్తయని ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి దునికినం. తెలంగాణ వచ్చాక సర్కారు నౌకరీ పేదోళ్లకు, మధ్య తరగతోళ్లకు వస్తదా.. మన దాకా ఉద్యోగాలు రానిస్తారా.. గత ప్రభుత్వాల మాదిరి లంచం ఇచ్చినోళ్లకే కొలువులు ఇస్తే ఏం చేసుడూ అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. 2014 నుంచి 2023 వరకు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీని నిరవేరుస్తూ.. లక్షన్నర పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివిన వారికి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించింది. ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా నిబంధనలను అనుసరించి అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఏ చిన్న పైరవీ లేకుండా, నయాపైసా అవినీతికి తావులేకుండా నియామకాలు చేసింది. రోజు కూలీ పనులు చేసుకొని కుటుంబాలు, మారుమూల అడవుల్లోని పూరిగుడిసెల్లో ఉండే కుటుంబాలు, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు ఎంతో మంది బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. తెలంగాణ వచ్చాకే తమ బిడ్డలకు సర్కారు కొలువులు వచ్చినయంటూ వారి తల్లిదండ్రులు సంబురపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక వారి కుటుంబాలకు జరిగిన మేలును ఈ జన్మలో మరువలేమంటూ భావోగ్వేదానికి లోనవుతున్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
తెలంగాణ రాకుంటే ఉద్యోగం రాకపోయేది
లక్ష్మణచాంద, అక్టోబర్ 31: మాపేరు బుర్క లక్ష్మి, ముత్యం. మాది ధర్మారం గ్రామం. మా బిడ్డ పేరు బుర్క శ్రీలత. బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేసింది. ఆ తర్వాత టీటీసీ కోర్సు చేసింది. తెలంగాణ రాకముందు ఉద్యోగాల నోటిఫికేషన్ లేకపోవడంతో ఉద్యోగం రాలేదు. తెలంగాణ కోసం కొట్లాట జరుగుతుండగా ఇక తెలంగాణ రాదు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాదు అనుకున్నం. కానీ కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. దీంతో మాబిడ్డకు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మామడ మండలంలో పంచాయతీగా కార్యదర్శిగా పని చేస్తున్నది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదికాదు. మా బిడ్డకు ఉద్యోగం వచ్చేది కాదు. గిప్పుడు మాకెంతో ఆనందంగా ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటం. గిప్పుడు కూడా ఎన్నో నోటిఫికేషన్లు వేసిండ్రు. పిలగాండ్లు మంచిగ చదువుకుంటే ఉద్యోగాలు అవే వస్తయ్.
నా కొడుక్కి పోలీస్ ఉద్యోగం వచ్చింది
దహెగాం, అక్టోబర్31 : నాకు కొడుకు ప్రకాశ్, కూతుళ్లు స్వప్న, అనిత ఉన్నారు. నా పిల్లలు చిన్నగున్నప్పుడే మా ఆయన రామయ్య అనారోగ్యంతో చనిపోయిండు. మాకింత భూమి ఉంది. దాన్ని సాగు చేసుకుంటూనే కూలీ పనులకు పోతున్న. కష్టపడి పిల్లల సాదుకున్న. కొడుకును బీఈడీ దాకా చదివించిన. ఏదైనా ఉద్యోగం రాకపోదా.. మా కుటుంబానికి ఆసర కాకపోతాడా అని ఎదురు చూస్తూ వచ్చిన. తెలంగాణ వచ్చినంక సంబురమనిపించింది. సీఎం కేసీఆర్ సార్ పోలీస్ ఉద్యోగాలు వేస్తున్నడమ్మా అని నా కొడుకు చెప్పిండు. కోచింగ్కు పోయిండు. రోజు ఎక్సర్సైజ్ చేసేటోడు. అట్టా మస్తు కష్టపడ్డడు. 2018లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రతి నెలా జీతం వస్తుంది. నా బిడ్డల పెండ్లిళ్లు కూడా చేసినం. తెలంగాణ సర్కారోళ్లు ఇచ్చిన ఉద్యోగంతో ఇప్పుడు సంతోషంగా బతుకుతున్నం.
– రౌతు సరోజన, గిరివెల్లి
పేదింటి నుంచి కానిస్టేబుల్గా..
కుంటాల, అక్టోబర్, 31: మండలానికి చెందిన గడ్డం సంధ్యారాణిది నిరుపేద కుటుంబం. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయిండు. అప్పటి వరకు ఉన్న పరిస్థితి మొత్తం మారిపో యింది. కుటుంబ కష్టాలను చూసి చదువే అన్నింటికీ సమాధా నం అని డిసైడ్ అయ్యింది. పదో తరగతి లో సెకండ్ టాపర్ వచ్చినందుకు రూ. 3 వేలు రివార్డ్ ఇచ్చిన్రు. ఆ డబ్బు తోనే నిర్మల్ గవర్నమెంట్ కాలేజీలో (గర్ల్స్) జాయిన్ అయ్యింది. బీసీ మేనెజ్మెంట్ హాస్టల్లో ఉంటూ ఇంటర్ కంప్లీట్ చేసింది. తర్వాత డబ్బులు లేకపోవడం, ఇంట్లో ఇబ్బందుల వల్ల చేను పని, బీడీలు చుట్టింది. చేనులో పనిచేస్తుండగా 2017 లో పాము కాటేసింది కూడా. హస్పిటల్ ఖర్చు, అప్పుల వల్ల ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు. ఇక ఏడాది అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యింది. ఆ తర్వాత కంప్యూటర్ నేర్చుకుంది. చిన్న జాబ్ చేస్తూ డిగ్రీలో జాయిన్ అయింది. డిగ్రీ ఫస్టియర్ ఇలాగే కంటిన్యూ చేసింది. కరోనా టైమ్లో ఇబ్బందులతో ఇంటికి చేరింది. ఇక ఇంటి నుంచే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంటిన్యూ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేస్తే అప్లే చేసింది. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ లో ఎంకామ్ చదువుతున్నది. ఇక ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో సంధ్యారాణికి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగమొచ్చింది.
కొడుకులిద్దరూ సర్కారు ఉద్యోగులే..
గతంలో ప్రభుత్వాలు నోటిఫికేషన్లు వేయకపోవడంతో నా పెద్ద కొడుకు శ్రీనివాస్ ప్రైవేట్ జాబ్ చేస్తుండే. ఇగ చిన్నోడు శ్రీకాంత్ చిన్నచిన్న పనులు చేసుకునేటోడు. ఇద్దరు మంచిగ చదువుకున్నరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంతోనే చదువుడు మళ్లీ షురూ జేసిండ్రు. పెద్దోడికి గూప్ 2 కొంత తేడాతో మిస్సయ్యింది. 2017లో టీఆర్టీతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇద్దరు పిల్లలు మంచిగ చదువుడు మొదలుపెట్టిన్రు. కోచింగ్ పోయే స్థోమత లేకపోవడంతో, నిర్మల్లో ప్రభుత్వ గ్రంథాలయంలో ప్రిపేరయ్యిన్రు. అద్దె భవనంలో ఉంటూ ఒక్క పూట భోజనం చేస్తూ రాత్రింబవళ్లు చదివిన్రు. 2019లో పెద్దోడు శ్రీనివాస్కు సోషల్లో స్కూల్ అసిస్టెంట్గా నౌకరొచ్చింది. ఇగ చిన్నోడు జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైండు. పెద్దోడు సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, చిన్నోడు నేరడిగొండ మండలంలో పని చేస్తున్నడు. ఎలాంటి పైరవీలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవేం పట్టించుకోకుండా బిడ్డలిద్దరూ మంచిగ చదువుకున్నరు. ఉద్యోగాలు సాధించిన్రు. ఇంతకన్న సంతోషం ఏముంటది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంకనే పిల్లలిద్దరికీ ఉద్యోగాలొచ్చినయ్. కష్టపడితే మస్తు అవకాశాలు వస్తయనడానికి నా బిడ్డలిద్దరూ సాక్ష్యం.
స్వరాష్ట్రంలోనే నా బిడ్డకు నౌకరచ్చింది..
భీంపూర్, అక్టోబర్ 31: మాది భీంపూర్ మండలం కరంజి. తెలంగాణ ప్రభుత్వం వేసిన పోలీస్ ఉద్యోగాల్లో నా బిడ్డకు ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. నాకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. పెద్దోడు రాజు హైదరాబాద్లో ఐఐసీటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశాడు. పరిశోధనలు చేస్తున్నడు. చిన్నోడు డిగ్రీ తరువాత రెండేళ్లు వ్యవసాయంలో మాకు సహాయపడ్డడు. పెద్దోడు చెప్పిండని పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నడు. సర్కారు బళ్లనే ఇద్దరూ సదువుకున్నరు. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లు ఇవ్వడంతోనే మా రవికి ఉద్యోగం వచ్చింది. నా బిడ్డల పెండ్లిళ్లు కూడా చేసిన. ముగ్గురికీ కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చినయ్. గతంలో మస్తు సర్కార్లను చూసిన. ఇట్ల గరీబు పిలగండ్లకు ఉద్యోగాలు అచ్చేట్లు చెయ్యలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమాని ఇయ్యాల నా బిడ్డకు ఉద్యోగం వచ్చింది. గి సర్కారు పిలగాండ్లకు సదువులకు, నౌకర్లకు ఎంతో సౌలతులు చేస్తున్నది.
-సిల్వర్ చిన్నయ్య, కరంజి
గృహిణి నుంచి పోలీస్గా..
ఈ ఫొటోలోని మహిళ పేరు పెండెపు అంకితాయాదవ్. వీరిది భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామం, మెట్టినిల్లు ఇదే మండలంలోని అందర్బంద్. తలిదండ్రులు కొక్కెరి విలాస్, భూమక్క. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించారు. ఇక సోదరుడు అంకూశ్ యాదవ్ నేవీలో ఉద్యోగి. తలిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో బాగా ప్రిపేరై, ఇటీవల సివిల్ కానిస్టేబుగా ఎంపికైంది. ఎస్ఐ పరీక్షలో రెండు మార్కులతో వెనుకబడింది. కాకతీయ యూనవర్సిటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన అంకిత భవిష్యత్లో ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నది. ఆమెను అందర్బంద్కు చెందిన రైతు పెండెపు కిరణ్కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఒక బాబు. తెలంగాణ ప్రభుత్వం వేసిన ఉద్యోగాల వల్లే తనకు ఉద్యోగావకాశం వచ్చిందని ఆమె చెబుతున్నారు.
ఒక్క పైసా లేకుండా ఉద్యోగం వచ్చింది
లక్షెట్టిపేట, అక్టోబర్ 31 : నాకు ఇద్దరు కొడుకులు సంతోష్, సందీప్. నా భర్త వాళ్లు చిన్నగున్నప్పుడే చనిపోయిండు. పిల్లలిద్దరూ పేపర్, పాల ప్యాకెట్లు వేసుకుంట సర్కారు బడుల్లో చదువుకున్నరు. పెద్ద కొడుకు సంతోష్ బీఈడీ చేసిండు. చిన్నోడు సందీప్ డిగ్రీ చదివిండు. నేను వత్తులు చేసేదాన్ని. ముగ్గురం కష్టపడినా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. పైసలు పెట్టనిదే ఏ ఉద్యోగం రాదని మస్తు మంది భయపెట్టేటోళ్లు. కానీ ఈ మధ్యే నా చిన్న కొడుకు సందీప్కు పోలీసు ఉద్యోగం వచ్చింది. నేను చిల్లి గవ్వ కూడా ఎవరికీ లంచం ఇవ్వలేదు. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమేనని మేము గర్వంగా చెప్పుకుంటున్నం. నా కొడుకులు కూడా అనేటోళ్లు.. మునుపటి ప్రభుత్వాల లెక్క కాదమ్మా.. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం.. లంచం ఇచ్చే అవసరముండదన్నరు. వాళ్లు చెప్పిందే నిజమైంది. సీఎం కేసీఆర్ వల్ల వేలాది మంది పేద బిడ్డలకు ఉద్యోగాలచ్చినయి. గాయన చల్లంగుండాలే.
– చిటుమల్ల భాగ్యలక్ష్మి, లక్షెట్టిపేట
మావోడికి ఉద్యోగం వచ్చింది..
మామడ, అక్టోబర్ 31: మాది నిర్మల్ జిల్లా మామడ మండలం లోని తాండ్ర గ్రామం. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. తెలంగాణ సర్కారు వచ్చినంకనే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తున్నది. నా రెండో కొడుకు 2019లో పంచాయతీ కార్యదర్శి కొలువు కొట్టిండు. ప్రస్తుతం నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ వల్లే మావోడికి ఉద్యోగం వచ్చింది. ఒక్క రూపాయి పైరవీ లేకుండా ఉద్యోగంలో చేరిండు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగానికి పోయి వస్తున్నడు.
-కొడిపుల నారాయణ, తాండ్ర