కౌటాల, మే 12 : రైతులకు అండగా ఉంటానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు. రైతులు వ్యవసాయ రంగంలో రాణించి, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మండలంలోని గుండాయిపేటలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయం చేసుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తాను కల్పిస్తానని భరోసా ఇచ్చారు. రైతులు పంటలు బాగా పండించి ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే తనకు సంతోషం కలుగుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని రైతులు ఎమ్మెల్యే కోనప్పకు విన్నవించారు. వెంటనే ఆయన స్పందించారు. డీడీ తీసిన ప్రతి రైతుకూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రైతులు అప్పులు తీసుకునే రోజు నుంచి రైతులే అప్పు ఇచ్చేలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో మాట్లాడి రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పారు. పంటల సాగుకు భూములు చదును చేసుకోవాలని సూచించారు. త్వరలోనే గుండాయిపేట – నందివర్ధన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే గుండాయిపేట రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఈ గ్రామంలోని భూములకు మీరు ఊహించని విధంగా ధరలు పెరుగుతాయన్నారు. ఆయన వెంట ఎంపీపీలు విశ్వనాథ్, నానయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఉపసర్పంచ్లు లహాంచు పటేల్, పసునూరి తిరుపతి, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.