నిర్మల్ అర్బన్, నవంబర్ 24: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఖర్చుకు వెనుకాడకుండా లబ్ధిదారులకు నాణ్యమైన ఇంటిని పూర్తి సౌకర్యాలతో సిద్ధం చేస్తున్నది. నిర్మల్ పట్టణ శివారులోని బంగల్పేట్, నాగనాయిపేట్ కాలనీలో ఇప్పటికే డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, అధికారులు అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేశారు. నిర్మల్ పట్టణంలో 1726 మంది డబుల్బెడ్ రూం ఇండ్ల జాబితా సిద్ధం కాగా, అధికారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని తిరుమల, దివ్య, రాజరాజేశ్వర గార్డెన్లలో లబ్ధిదారులను లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు.
1726 మంది అర్హుల గుర్తింపు
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో ఇండ్లులేని పేదలను అధికారులు గుర్తించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించారు. రెండు, మూడు దఫాలుగా అర్హులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీస్, హైదరాబాద్కు పంపించారు. వారి ద్వారా జరిపిన వెరిఫికేషన్లో 1726 మంది అర్హులను అధికారులు గుర్తించారు. ఇండ్లను అందించేందుకు మూడు చోట్ల లాటరీ నిర్వహించనున్నారు.
జిల్లాలో వేగంగా ఇండ్ల నిర్మాణాలు
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మల్ జిల్లాకు 6686 ఇండ్లు మంజూరయ్యాయి. మొదటి విడుతలో 42 ఇండ్లను నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లిలో లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో దశల వారీగా అందజేశారు. నిర్మల్ పట్టణంలోని నాగనాయిపేట్, బంగల్పేట్ కాలనీలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, పంపిణీకి సిద్ధం చేశారు.
పారదర్శకంగానే ఎంపిక ప్రకియ..
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను అధికారులు పారదర్శకంగా ఎంపిక చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపిన తర్వాతే అర్హులను గుర్తించాం. మూడు దఫాలుగా వెరిఫికేషన్ చేసిన తర్వాత జాబితాను స్టేట్ టెక్నికల్ టీంకు పంపించి అర్హులను గుర్తించాం. ఇండ్లు ఇప్పిస్తామనే దళారులను నమ్మవద్దు. పేదలను మోసం చేసి, డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్