ఎదులాపురం, ఫిబ్రవరి 6 : గుప్త నిధుల పేరిట మోసం చేసిన నకిలీ బాబా సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన దర్శనాల రాజ్కుమార్ మూడేండ్ల క్రితం తనకు దేవర వస్తున్నదని, తనకు మంత్ర శక్తి ఉందని చుట్టూ పకల గ్రామాల వారిని నమ్మించాడు. తను మంత్ర శక్తి ద్వారా బంగారం తవ్విస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీనికితోడు వరుసకు బావ అయిన మహేందర్, మిత్రులు నవీన్, అరుణ్, శ్యాం, అఖిల్, కిరణ్లతో గ్యాంగ్ తయారు చేశాడు.
గుప్త నిధులు ఉ న్నాయంటూ చెప్పిన వారి ఇంటికి వెళ్లి అతని మిత్రుల సా యంతో గుంతను తవ్వించి అందులో తనతో తీసుకొచ్చిన కుం డలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నకిలీ నాణేలు కుండలో పెట్టేవా డు. ఇంటి సభ్యులకు దూరం నుంచి చూపిస్తూ నకిలీ నాణేలను ఒక ఎర్రని బట్టలో కట్టి 41 రోజులు ముట్టకుండా పూజలు చే యాలని సూచించేవాడు. తర్వాత తను వచ్చి తీస్తానని డబ్బు లు తీసుకొని వెళ్లేవాడు. ఇలా 26 మంది వద్ద నుంచి రూ.1.03 కోట్లు తీసుకున్నారు. ఇప్పటికీ వీరిపై వివిధ పోలీస్స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక బైకు, ఏడు మొబైల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు, కుండలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ జి శ్రావణ్, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు.