ఇచ్చోడ, అక్టోబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ పథకంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణాలుగా దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నీడనిస్తూ పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి.
ఇచ్చోడ మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ప్రతి జీపీలో ప్రధాన రహదారికి ఇరువైపులా కిలో మీటరుకు నాలుగు వందల మొక్కలను హరిత హారంలో భాగంగా నాటారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణలో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నాటించారు. ముక్రా (కే), జామిడి, ముక్రా(బీ), అడెగామ(కే), మల్యాల, తలమద్రి, సిరిచెల్మ, ఇచ్చోడ, జున్నీ, బోరిగామ, కామగిరి, నర్సాపూర్, ధరంపురి, దాబా(కే), మాన్కపూర్, బాబ్జీపేట్, గుండాల, కేశవపట్నం, దేవుల్నాయక్ తండా, సాథ్నంబర్ గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటారు. నాటిన మొక్కల సంరక్షణకు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని సంరక్షించేలా ప్రతి శుక్రవారం(వాటర్ డే) ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ మొక్కలన్నీ ఏపుగా పెరిగి రోడ్లకు ఇరువైపులా కనువిందు చేస్తూ ఆహ్లాదపరుస్తున్నాయి. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
భావితరాలను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా రకరకాల మొక్కలను నాటారు. వీటిలో నీడనిచ్చే మొక్కలతోపాటు పండ్లు, షోకేజీ మొక్కలు, వేప, రాగి, మర్ర కొబ్బరి, చింత, మామిడి, జామ, బాదం, అల్లనేరడి, కానుగ మొక్కలు నాటారు. యేటా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడం, వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని మొక్కలను అందించడంతో మూడేండ్లలోనే మొక్కలు ఏపుగా పెరిగాయి.
హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ కంటి రెప్పలా కాపాడు తున్నాం. ప్రతి శుక్ర వారం జీపీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాం. మూడేండ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. రోడ్డు మార్గం వెంట వెళ్లే వారికి హాయిని గొలుపుతున్నాయి.
– భూతి లావణ్య, సర్పంచ్, మల్యాల