భైంసా, డిసెంబర్ 5 : కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ స్పష్టంచేశారు. భైంసా పట్టణంలోని కమల జిన్నింగ్ ఫ్యాక్టరీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గ అభివృద్ధికి తన హయాంలో శాయశక్తులా కృషి చేశానన్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు తనను వారి పార్టీలో చేరాలని ఆహ్వానించాయని చెప్పారు. తాను సెక్యూలర్ భావజాలం గల వ్యక్తినని, బీజేపీ చేరబోనని స్పష్టం చేశారు.
టికెట్ విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతోనూ జత కట్టబోనన్నారు. ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో 100 పడకల దవాఖాన, గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాల, ఐ ఆస్పత్రి, ట్రిపుల్ ఐటీ కళాశాల తన హయాంలోనే నిర్మించినట్లు చెప్పారు. గూడు లేని పేదవారికి దాదాపు 50 వేలకు పైగా ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు మంజూరు చేయించి నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు శంకర్ చంద్రే, భీంరావ్, షేక్ మీరా, అఖిలేశ్ పటేల్ పాల్గొన్నారు.