మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 1: అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ కమిటీ నాయకులు విమర్శించారు. గురువారం మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిలర్ అంకం నరేశ్, నస్పూర్ కౌన్సిలర్ ముత్తె రాజేశం మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులను మంజూరు చేయించి, వాటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన దివాకర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని, అతను ఎందుకు పరిశీలిస్తాడని ప్రశ్నించడం దుర్మార్గమన్నారు.
గూడెం లిఫ్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మెడికల్ కాలేజీ, వందల కోట్లతో రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులను చేపట్టిన ఘనత దివాకర్రావుదేనన్నారు. అప్పుడు చేసిన మొదలు పెట్టిన పనులను ఇప్పుడు గెలిచిన నాయకులు ప్రారంభిస్తున్నారని, మిషన్ భగీరథ నీరు రావాలంటే ముందుగా నిధులు, టెండర్లు, పనులు చేయాల్సి ఉంటుందని, ఊరికే వచ్చి నల్లాను తిప్పితే రాలేదని గుర్తుచేశారు. అటవీ అనుమతులు కేంద్రం పరిధిలో ఉంటాయన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు.
మంచిర్యాలలో నీటి సరఫరా విషయంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారని, అయితే ఈ ఫెయిల్యూర్లో కౌన్సిలర్ ఉప్పలయ్య భాగస్వామ్యం కూడా ఉన్నదని, ఎందుకంటే అతను 30 ఏళ్లుగా కౌన్సిలర్గా, ఒక సారి వైస్ చైర్మన్గా కూడా పనిచేశారని గుర్తు చేశారు. నస్పూరులో రోడ్డు పనుల విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఆయన తనయుడు డబ్బులు వసూలు చేశారని కౌన్సిలర్ వేణు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని, దమ్ముంటే నిరూపించాలని, గుళ్లోకి వెళ్లి ప్రమాణం చేయాలన్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదని, అప్పుడే విమర్శించడం సరికాదని ఓపిక పడుతుంటే చేతకానితనంగా తీసుకుంటున్నారని, ఇకనుంచి ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజలతో కలిసి పోరాడుతామని తెలిపారు. మంచి పనులను చేస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూముల విషయంలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి వెంటనే వాటిని బయటకు తీసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్రెడ్డి, తోట తిరుపతి, శ్రీపతి వాసు, ఎర్రం తిరుపతి, సుధీర్, గట్టయ్య, తాజుద్దీన్, శంకర్, మల్లేశ్, రమేశ్, సాగర్, తదితరులున్నారు.