జైనూర్ : ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Laxmi ) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ ( FRO Ramesh ) వెంటనే క్షమాపణ ( Apology ) చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల నాయకులు ,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాధవరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల మాట్లాడారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను అడ్డుకోవద్దని ఎన్నోసార్లు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. ఓట్ల కోసమే ఎమ్మెల్యే కోవ లక్ష్మి రాజకీయం చేస్తుందని రేంజ్ అధికారి హేళనగా మాట్లాడారని విమర్శించారు. రేంజ్ ఆధికారి రాజకీయాలు చేయాలని ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీల కండువాలు కప్పి రాజకీయాలు చేయాలని సూచించారు.
ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం , ప్రశ్నించడం ఎమ్మెల్యే బాధ్యత అని పేర్కొన్నారు. రేంజ్ అధికారి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బావ్ రావు, జాదవ్ శ్రవణ్, కుమ్రం శ్యాంరావు, మాజీ సర్పంచ్ మెస్రం నాగోరావు, మడవి నాగోరావు, అమృత్, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, నర్సింగ్, భాస్కర్, ఉమాజీ, పోడు రైతులు ఉన్నారు.