కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/పెంచికల్పేట్, ఫిబ్రవరి 1: వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక నిఘా పెడుతోంది. ఇటీవల కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో జరిగిన పులుల ఘటనను దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజలు, పశువుల కాపరులను అడవుల్లోనికి వెళ్లకుండా ఆంక్షలు అమలు చేస్తోంది. పులులు, ఇతర వన్యప్రాణులు సంచరించే కోర్ ఏరియాలోకి జన సంచారం లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నది.
ఈ క్రమంలో అడవులకు వెళ్లే దారుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. వాహనాల రాకపోకలపై కూడా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నది. ఇక పశువులను మేత కోసం కోర్ అడవుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అయితే కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు చేసినప్పటి నుంచే ఈ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ అటవీ అధికారులు పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు.
ఇక అడవుల్లో వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టినా, జంతువులను వేటాడినా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. అటవీ సమీప గ్రామాల్లో ఫారెస్ట్ బీట్ స్థాయి అధికారులు నిరంతరం నిఘా పెడుతున్నారు. మరోవైపు అటవీ జంతువుల దాడుల్లో చనిపోయిన పశువులకు వారం రోజుల్లో పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటున్నది.
దీంతో పాటు అడవుల్లో వన్యప్రాణులను వేటాడడం, ఉచ్చులు పెట్టడం, విష ప్రయోగం చేయడం, తదితర చర్యలకు మూడు నుంచి ఏడేళ్ల పాటు కఠిన శిక్ష పడుతుందని అవగాహన కల్పిస్తున్నారు. బేస్ క్యాంపులను పటిష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అడవుల్లోకి వెళ్లేవారు అటవీ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రాణహిత సమీప గ్రామాలు, అటవీ సమీపాల్లో వ్యవసాయం చేసేవారిపై కూడా నిఘా ఏర్పాటు చేశారు.