కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతులపై కాంగ్రెసోళ్లు పగబట్టిండ్రు. మూడు గంటల కరెంట్ అని, 10 హెచ్పీ మోటర్లని.. మూడు గంటలు కాదు ఐదు గంటలని.. అసలు 24 గంటల కరెంటే అక్కర్లేదని.. ఎవ్వరికి తోచింది వాళ్లు మాట్లాడి రైతులను ఆగం పట్టించిండ్రు. ధరణిని రద్దు చేసి కౌలుదారు కాలం పెడతామని చెప్తూనే… రైతుబంధు రాకుండా అడ్డుకుంటున్నరు. ఇంకా ఎలక్షన్ కాకముందే.. నాలుగు ఓట్లు డబ్బాల పడకముందే రైతులను ఆగం చేస్తున్నోళ్లకు… పుసుక్కున రేపు ఓటు వేస్తే.. తమకు వెన్నుపోటు పొడిచినట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులపై పగబట్టిన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నమని చెబుతున్నరు. ధరణినీ రద్దు చేస్తే, కరెంట్ మూడు గంటలు చేస్తే సమస్యలు వస్తయంటున్నరు. ధరణి తీసేసి కౌలుదారు కాలం తెస్తే భూమి ఉన్న ఆసాములు కౌలుకు ఇచ్చుడు బంద్ చేస్తరు. దీంతో కౌలురైతుతో పాటు భూమి ఉన్న రైతు ఇబ్బంది పడాల్సి వస్తది. వ్యవసాయ కూలీలుగా, పాడిపరిశ్రమల మీద, ట్రాక్టర్లు, ట్రాలీలు నడుపుకునేటోళ్లకు పని దొరకదు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయం బందైతది.
గడిచిన పదేళ్లలో పచ్చబడ్డ భూములన్నీ మళ్లీ పడావ్బడుతయ్. అన్నిటికంటే ముఖ్యంగా భూముల ధరలు అమాంతం పడిపోతయ్. మూడు గంటల కరెంట్తో సరిపడా నీళ్లు రాక రైతులు గోసపడ్తరు… ధరణితో మళ్లీ కాంగ్రెస్ పాత కాలం నాటి దరిద్రపు రోజులొస్తయ్.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనమై తెలంగాణలో ఎవుసం దండుగైతది.. గివన్నీ కావొద్దు అంటే కాంగ్రెసోళ్లకు బుద్ధి చెప్పక తప్పదు. మళ్లొక్కసారి బీఆర్ఎస్ను గెలిపించుకోక తప్పదని రైతులు చెప్తున్నరు. కాంగ్రెస్ వస్తే ఏం ప్రమాదం వస్తదనేది రైతుల మాటల్లోనే…
గీ కాంగ్రెసోళ్ల మాటాలు ఇన్నంక కూడా గాళ్లకే ఓటేస్తే మనంత బుద్ధితక్కువోళ్లు ఉండరు. మూడు గంటల కరెంటిస్తే ఏడ సరిపోతది. పదెకరాలు ఉంటే మూడు, నాలుగు ఎకరాలు తడుస్తది. ఇయ్యాల పారిన మడికే మళ్లా రేపు కూడా నీళ్లు పారుతయ్. ఎటూ కాకుండ అయితది. 10 హెచ్పీ మోటర్ పెట్టుకునేంత స్థోమత నాకైతే లేదు. బువ్వ పెట్టకున్నా మంచిదే గానీ.. నోటికాడ కూడును లాగేస్తమంటే ఊకుంటమా.. గా కాంగ్రెసోళ్ల కరెంట్ వద్దు, 10హెచ్పీ మోట్ వద్దు. గాళ్లకు ఓటేస్తే ఎవుసం ఆగమైతది. ధరణి రద్దు చేసి.. కౌలుదారులకు హక్కులిస్తే మరి యాజమాని ఏడికిపోవాలే. నాకు చేతనైనన్ని రోజులు చేసి కౌలుకే ఇయ్యాలే. అట్లని నా భూమి కౌలుదారుకిస్తే నీను యాడపోవాలే.. నా కొడుకులు యాడ పోవాలే. ఇవన్ని చూస్తే వవ్యసాయం చేసుడుకన్నా ఊకునుడే ఉత్తమం అనిపిస్తంది. ఇప్పుడు 24 గంటల కరెంటిస్తున్నరు. రైతుబంధు పడుతున్నది. వరి పండిస్తే సర్కారోళ్లే కొంటున్నరు. ఇయ్యాల కూడా పంట అమ్ముకునేందుకే కొనుగోలు కేంద్రానికి అచ్చిన. గివన్ని సౌలత్లు ఇచ్చినోళ్లను కాదని.. కాంగ్రెస్కు ఎందుకు ఓటేస్తం.
– ముత్తె కమలాకర్, రైతు, నంనూర్
కాంగ్రెస్కు ఓటేస్తే ధరణి పోతది. మళ్లీ దోపిడీ రాజ్యం వస్తది. ఇదే కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడ్డం. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏండ్లకేండ్లు తిప్పలు పడ్డం. ఆఫీసుల చుట్టూ తిరిగీ తిరిగీ యాష్టకొచ్చేది. పైసలు ఇచ్చిన వారి పనులే అయ్యేటివి. గరీబోళ్లు పోతే పట్టించుకోకపోయేటోళ్లు. కాంగ్రెస్ రైతబంధు పథకానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది. పట్టాదారులకు కాకుండా కౌలు రైతులకు రైతుబంధు ఇస్తదట. అట్లెట్లా సాధ్యమైతది. నా లాంటి ముసలోళ్లు ఉన్న కొద్ది పాటి భూముల్లో వ్యవసాయం చేసుకోలేకా కౌలుకు ఇచ్చుకుంటం. పట్టాదారులకు కాకుండా కౌలు రైతులకు రైతుబంధు ఇస్తే మా గతి ఏమైతది. మాలాంటి పట్టాదారులకు అన్యాయం చేసే కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వం. ఇలాంటి పార్టీకి ఓట్లేస్తే మళ్లా బతుకులు ఆగమైతయ్. ధరణిలో కౌలు రైతుల కాలం పెట్టాలని ఆలోచించే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతాం.
– సిడాం ముత్త , కొలాంగూడ, కెరమెరి
కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడ్డం. కరెంటియ్యక.. నీళ్లియ్యక అరిగోస పెట్టేటోళ్లు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలంలనే పంట వెళ్లేది. ఇగ ఎండాకాలంలో పొలాలన్నీ బీళ్లుగానే ఉండేటివి. నరకం చూపిన్రు. మళ్లా గాళ్లకే అధికారం ఇస్తే రైతుల బతుకులు ఆగమైతయ్. రైతుబంధు రాదు. కరెంటియ్యరు. పంటలు పండవు. ధరణి కూడా ఎత్తేస్తమని డైరెక్ట్ చెబుతున్నరు. భూముల కొట్లాటలు అయితయ్. లంచగొండులు పెరుగుతరు.
ఎవ్వరి భూమి.. ఎవ్వరికైనా రాసిస్తరు. యేడాదిలో ఒక్క పంట తీసుడు కూడా కష్టమైతది. మళ్లా రైతులంతా కూలీ పనులకు పోవాల్సి వస్తది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో ఆ పార్టీ నిజ స్వరూపం బయటపడింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంతర విద్యుత్, రైతుబంధుతో భూముల ధరలు మస్తు పెరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఎలాంటి పనికి రాకుండా ఉన్న భూములకు కూడా ఇప్పుడు రూ. లక్షల్లో విలువ పెరిగింది. మళ్లీ మమ్ములను బికారీలను చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకున్నట్లుంది. చేతులెత్తి మొక్కుతున్న ఆ పార్టీని అస్సలు నమ్మవద్దు. బీఆర్ఎస్ సర్కారు చేసిన మేలును మరచిపోవద్దు.
– టేకం గుండా, పిట్టగూడ, కెరమెరి
వ్యవసాయం చేసే రైతులకు ఎన్ని గంటల కరెంట్ అవసరమో తెలిసిన వాళ్లు ఇలా మాట్లాడరు. రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ రైతుబంధుతో పాటు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నడు. మేమంతా రంది లేకుంట ఎవుసం చేసుకుంటున్నం. ఇంతకంటే మంచి పథకాలు తీసుకొస్తామని చెప్పేటోళ్లును చూసినం.. గీ కాంగ్రెసోళ్లు మంచి పథకాలను కూడా పోగొడుతమని చెబుతున్రు. అసలు ఆ పార్టీ అంటే దరిద్రం.. యేండ్లకేండ్లు బాధ పడ్డం. మళ్లా నమ్మి మోసపోము. 24 గంటల కరెంటు సరఫరాను నిలిపేసి 3 గంటలిస్తరట. మళ్లేమో 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటున్నరు. గీ ఖర్చులన్నీ ఎవ్వడు పెట్టుకోవాలె. మంచిగున్నది పోగొట్టి.. ఏదేదో తెస్తమని చెబుతున్రు. గా మాటలతోనే అర్థమైతంది.. గా కాంగ్రెసోళ్లు ఎసొంటోళ్లో. నేనే కాదు రైతులందరం కలిసి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతాం.
– రాథోడ్ గోవింద్, చందుగూడ, కెరమెరి
24 గంటల కరెంట్తో ఎప్పుడొచ్చి స్విచ్ వేసినా.. పొలం పారుతది. మళ్లా పాత లెక్కన మూడు గంటల కరెంటిస్తే.. గదికూడా ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో ఎవరికి ఎరుక.. పడిగాపలు కాయాల్సి వస్తది. ఏ రాత్రో వచ్చే కరెంట్ కోసం ఎన్ని కష్టాలు పడాలి. మూడు గంటలు ఇస్తే యేడ సరిపోతది. సాగు చేసేటోళ్లు తగ్గుతరు.
ఏమన్న మిగులుతది అంటనే రెక్కల కష్టం చేస్తరు కానీ.. ఎంత కష్టపడినా ఏం రాదు అన్నప్పుడు ఎందుకు చేస్తరు. కాంగ్రెసోళ్లు దొంగలు. వాళ్లు ఉన్నప్పుడు ఇయ్య చేతగాలే. ఇప్పుడొచ్చి కరెంట్ అక్కరే లేదంటున్నరు. ఒక్క నెల బువ్వ తినకుండా ఉంటరా.. వాళ్లు. వ్యవసాయానికి కరెంట్ కూడా అట్లనే. రైతులపైన కక్ష
గట్టినట్లు ఉన్నరు. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నం. ఇట్లనే ఉండాలనుకుంటాం. పోయిపోయి కష్టాలు తెచ్చుకోవాలనుకుంటమా.. గా కాంగ్రెస్కు ఓటు వేసేదే లేదు. ధరణి ఉండుడే కావాలే.. 24 గంటల కరెంట్ కావాలే.. అన్ని కావాలే. అందుకే మళ్లోసారి కారుకే గుద్దుత నీనైతే.
– చెల్ల తిరుపతి, నంనూర్
కరెంటియ్యమని కాంగ్రెసోళ్లు కుల్లం కుల్లం చెప్పబట్టే. టైమ్కు వచ్చే రైతుబంధు రాకుండా అడ్డుకున్నరు. ఆయింత ధరిణి రద్దు చేస్తే రైతుబంధు కూడా ఆగమైతది. కౌలుదారులకు హక్కులు ఇచ్చినంక రైతులు ఎట్లా బతుకుతరు మరి. ధరణిని తీసేయాలనడం తప్పుడు ఆలోచన. కౌలుదారులకు హక్కులిస్తే రైతులకు.. వాళ్లకు పంచాయతీలు కావా.. కొట్టుకునుడు, తన్నుకునుడు.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు మళ్లా మొదలైతది.. ధరణి వచ్చినంకనే మా భూములకు రక్షణ పెరిగింది. కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మితే ఎవుసం చేసేటోళ్లు తగ్గుతరు. భూములను కబ్జా చేసేటోళ్లు పెరుగుతరు. మళ్లా పట్వారీలు, వీఆర్వోలు వస్తే లంచం ఇయ్యనిది పజ్జేయరు. ఎవ్వడు పైసలిస్తే వాని పేరు మీదికి భూమి మారుస్తరు. అన్నదమ్ముల మధ్య కూడా భూ పంచాయతీలు పెట్టిస్తరు. ఈ లొల్లిలని ఎందుకని ఎవుసం బంద్చేస్తే.. ఎవ్వరికి పనులు దొరకయ్. ఊళ్లకు ఊళ్లు నాశనం అయితయి. ఎవ్వరూ బతికేపరిస్థితి ఉండది.
– రసమల్ల మల్లాగౌడ్, గుడిపేట