నిర్మల్, జూలై 29(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావాసులను భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ నష్టం కలిగింది. చాలా చోట్ల పత్తి, మక్క, సోయా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో సాగవగా.. సుమారు 30 వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇస్తూనే.. నష్టం అంచనాను వేగంగా రూపొందించాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజులుగా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల పరిధిలోని చేలలో నీరు నిలిచింది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకు పోగా.. వంతెనలు, అప్రోచ్ రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 22 రోడ్లు దెబ్బతినగా, దాదాపు రూ.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో 80 కిలోమీటర్లకు పైగా 50 రోడ్లు దెబ్బతిన్నాయి.
వీటికి తాత్కాలికంగా మరమ్మతు చేసేందుకు రూ.3 కోట్లకు పైగా అవసరమవుతాయని, శాశ్వత పనులకు రూ.40 కోట్లు అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. 31 ప్రభుత్వ పాఠశాలల భవనాలు దెబ్బతినగా.. బాసర నుంచి భైంసా వరకు గల ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. రెండు రోజులుగా వరుణు డు శాంతించడంతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది. బాధితులను కలిసి నష్టం అంచనాను నమోదు చేసుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత రానున్నది. 106 ఇండ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. వీటితోపాటు చాలా చోట్ల పశువుల కొట్టాలు, పూరి గుడిసెలు పాక్షికంగా ధ్వంసం కాగా, గడ్డివాములు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరుగగా, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు నష్టం అంచనా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మరమ్మతులకు సిద్ధమవుతున్నారు.
మంత్రి, ఎమ్మెల్యేల పర్యటన
వరద వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డిలతోపాటు ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి విస్తృతంగా పర్యటించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండ గా ఉంటోందని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వారం రోజుల నుంచి నిర్మల్లోనే మకాం వేసి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షంలో సైతం కడెం ప్రాజెక్టు వద్దకు వెళ్లి రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉదయం సోన్ మండలంలోని స్వర్ణపై గల జాఫ్రాపూర్, మాదాపూర్ వంతెనలను పరిశీలించారు. దెబ్బతిన్న వంతెనలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సారంగాపూర్ మండలంలో ధ్వంసమైన మలక్ చించోలి రోడ్డును పరిశీలించారు. కంకెట, వైకుంఠాపూర్ గ్రామాల్లో కూడా పర్యటించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పంట నష్టపోయిన రైతులకు భరోసా నిచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ వరుణ్రెడ్డి, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు. భైంసా మండలంలోని ఇలేగాం, వాలేగాం, సిరాల గ్రామాలతోపాటు భైంసా పట్టణంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పర్యటించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భైంసా పట్టణంలో వరద ముంపునకు గురైన కాలనీల్లో రాష్ట్ర ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి పర్యటించారు. అలాగే ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు.