తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. పల్లెలు, పట్టణాల్లో వెలసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు రాగా, వారు వెంటనే రంగంలోకి దిగారు. కోటపల్లి మండలం రాపనపల్లి, కోటపల్లిలో పంచాయతీ సిబ్బందితో కలసి ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
జన్నారంలో తహసీల్దార్ వనజారెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా, ధర్మారం, అంబేద్కర్, పొనకల్ చౌరస్తా, భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వాటిని తొలగించారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు సిబ్బంది, పంచాయతీ కార్మికులు తొలగిస్తున్నారు. అనుమతులు లేకుండా పార్టీ జెండాలు, బాన్యర్లు ఏర్పాటు చేయవద్దని అధికారులు ఆదేశించారు.