ఉట్నూర్, మే 6 : ఏజెన్సీ అంటే అడవులు.. వాగులు.. వంకలు.. మారుమూల గిరిజన గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యం అందించడం ఒక టాస్క్ లాంటిది. మారుమూల గ్రామాల్లో వైద్యం చేయించుకునేందుకు వచ్చే వారు కొందరైతే.. మూఢ నమ్మకాలతో చికిత్స తీసుకోని వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి గిరిజనుడికి వైద్యం అందించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్కు రెండు, కుమ్రం భీం ఆసిఫాబాద్కు రెండు, మంచిర్యాలకు ఒకటి చొప్పున మొత్తం ఐదు ఆరోగ్య సంరక్షణ బృందాలను (మొబైల్ టీమ్స్) ఏర్పాటు చేశారు. ఒక వాహనంలో ఒక వైద్యుడు, ఒక స్టాఫ్ నర్స్ బృందంగా గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం అందించాలి. దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించాలి. వారికి ఎప్పటికప్పడు మందులు అందించాల్సిన బాధ్యత వారిదే. రెండు రోజుల క్రితం ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఈ వాహనాలను ప్రారంభించారు.
బృందాల విధులు..
ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి. వారి ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. మూఢ నమ్మకాలతో ప్రాణనష్టం జరగకుండా చూడాలి. గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. గర్భిణులకు సూచనలు, సలహాలు అందించాలి. బేబీ పెరుగుదలను పరీక్షించాలి. డెలివరీ టైంలో దవాఖానలో సుఖ ప్రసవం పొందేందుకు చర్యలు తీసుకోవాలి. బాలింతలను పరీక్షిస్తూ తగిన సలహాలివ్వాలి. క్షయ, కుష్ఠు వ్యాధులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాలి. మధుమేహం, రక్తపోటు, కంటి వ్యాధులకు చికిత్సలు చేసి మందులు అందించాలి.
ఏజెన్సీకి ఐదు టీంలు
ఉమ్మడి జిల్లాలో గిరిజన గ్రామాలు ఎక్కువ. చాలా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడాల్సివస్తున్నది. మూఢ నమ్మకాలతో గిరిజనులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉండి వైద్యం తీసుకోరు. దీంతో మారుమూల గ్రామాల్లో వైద్యం అందించేందుకు, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు రెండు, కుమ్రం భీం ఆసిఫాబాద్కు రెండు, మంచిర్యాలకు ఒకటి చొప్పున మొత్తం ఐదు అందించారు. వీరు నిత్యం గ్రామాల్లోకి వెళ్లి గిరిజనులకు వైద్యం అందించాల్సి ఉంటుంది.
ప్రతి గిరిజనుడికి వైద్యం అందించాలని..
ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనులకు వైద్యం అందించాలని ప్రభుత్వం ఈ ఐదు మొబైల్ బృందాలను అందించింది. వీరి ద్వారా గిరిజనుల్లో మూఢనమ్మకాలను పారద్రోలి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. గ్రామాల్లో డెలివరీలకు పీహెచ్సీలకు రాని మహిళలకు గుర్తించి ప్రతి నెలా మందులను అందించి సుఖప్రసవాలకు దవాఖానలకు తరలించేందుకు ఉపయోగిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులకు సకాలంలో మందులు అందించేందుకు ఈ వాహనాలు చాలా ఉపయోగపడనున్నాయి. కనీసం రోడ్డు లేని గ్రామాలకు సైతం ఈ వాహనాలు వెళ్లి వైద్యం అందిస్తాయి.
– బాలు, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి, ఉట్నూర్