చెన్నూర్ టౌన్/హాజీపూర్, జూన్ 28 : హిందువుల మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గురువారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని చెన్నూర్ ఉత్తర గోదావరి తీరంతో పాటు లక్షెట్టిపేట గూడెం సమీపంలోని గోదావరికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలను భక్తులు గోదావరికి తరలివస్తారు.
తొలి పండుగ ఏకాదశి..
తొలి ఏకాదశితో హిందువుల పండుగలు మొ దలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైం దవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉ న్నది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వా సంరం’, ‘పేలాల పండుగ’ అని కూడా పిలుస్తా రు. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాడ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీ మహా విష్ణువు క్షీర సాగరంలో శేష తల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశిన ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామి వారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది.
ఇటు పూజ.. అటు ఆరోగ్యం..
ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. ఇందుకోసం ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుంది. ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్ర నామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి రోజున సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం..
తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందుకే ఈ రోజున ఆలయాలు, ఇండ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తున్నది.