ఉట్నూర్ రూరల్/రుద్రూర్, ఆగస్టు 31 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్కు చెందిన లింగావత్ విష్ణు-వనితలకు నలుగురు సంతానం. ఇందులో రెండో సంతానం రక్షిత. రక్షిత నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్లో గల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజుల క్రితమే కళాశాల వసతి గృహంలో చేరింది. శనివారం వసతి గృహంలోని బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సీఐ జయేశ్రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు అత్యుత్సాహంతో రక్షిత తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలుపాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో వసతిగృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకున్నది. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, ఒకవేళ కారకులు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించారు. హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థిని ఆత్మహత్య ఘటనకు సంబంధించిన ముందు దృశ్యాలు రికార్డు కాకపోవడంపై రక్షిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్యతో రికార్డు కాకపోయి ఉండొచ్చని ప్రిన్సిపాల్ బాలాజీనాయక్ తెలుపగా.. టెక్నీషియన్ను పిలిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ చేపడతామని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. రక్షిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ జయేశ్రెడ్డి, రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు.