మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 3: మంచిర్యాలలోని ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను మిల్లర్లు పంపినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టేందుకు జనవరి 31వ తేదీ ఆఖరు కాగా మిల్లర్లు సాధ్యమైనన్ని ఏసీకేలు ఎఫ్సీఐకి పంపించారు. అయితే వీటిలో 13 ఏసీకేల బియ్యం లారీలు ఇంకా ఎఫ్సీఐ లోపల, బయట దించకుండా ఉండిపోయాయి. గడువు లోపు పంపినా అధికారుల నిర్లక్ష్యం మిల్లర్లకు ఇబ్బందికరంగా మారింది.
ఎఫ్సీఐలో బియ్యం బస్తాలు అన్లోడింగ్ చేయడానికి హమాలీ కాంట్రాక్టర్ నారాయణ సరిపడా హమాలీలను సిద్దం చేయాలి. గడువు కారణంగా మిల్లర్లు పోటీపడి బియ్యం ఎఫ్సీఐకి పంపించారు. జనవరి 30న సుమారు 34 ఏసీకేల బియ్యం, 31న 43 ఏసీకేల బియ్యం వచ్చింది. అయితే హమాలీల కొరత ఉండడంతో, ఆయా మిల్లుల్లో పని చేసే సుమారు 50 మందిని ఎఫ్సీఐకి పంపించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఎఫ్సీఐకి వేబిల్లతో వచ్చిన లారీల వే బిల్లు తీసుకొని సీరియల్ ప్రకారం అన్లోడింగ్ చేయించాల్సి ఉంటుంది. అయితే ఎఫ్సీఐ అధికారులు కాకుండా లారీ అసోసియేషన్కు చెందిన పాషా, శ్రీధర్ వే బిల్లులు కలెక్ట్ చేశారు. ఈ క్రమంలో మిల్లర్లకు చెందిన వాహనాలు కాకుండా వారికి చెందిన వాహనాలను ముందస్తుగా అన్లోడ్ చేయించుకున్నారని, మిగతా లారీల వే బిల్లులు కూడా ఇంకా వారి వద్దే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వాహనాలు సీరియల్ తప్పి దించుకున్నారనే ఆరోపణులు వెల్లువెత్తుతున్నాయి. సీరియల్ తప్పించడంతో జనవరి 30వ తేదీన వచ్చిన లారీల్లో సుమారు నాలుగు అన్లోడ్ కాలేదు. 31వ తేదీన వ్యాగన్ రావడంతో, రాత్రి వరకు దానిని నింపే పనిలో హమాలీలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత లారీల్లో నుంచి దింపినా దాదాపు తొమ్మిది వాహనాలు అన్లోడ్ చేయకుండా వదిలేశారు. బియ్యం బస్తాలు దించుదామన్న ఆన్లైన్ లాక్ కావడంతో ఆపేశారు. దీంతో మొత్తంగా 13 ఏసీకేల బియ్యం లారీల్లోనే ఉండిపోయింది.
ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎఫ్సీఐ అధికారులు వాహనాలను వెనక్కి పంపించారు. ఒకసారి ఎఫ్సీఐకి వచ్చిన బియ్యం రిజక్ట్ అయితే వెనక్కి పంపాలి కానీ అధికారుల తప్పిదం బయటకు వస్తుందని యాజమానులు, మిల్లర్లపై ఒత్తిడి తీసుకువచ్చి ఎఫ్సీఐ నుంచి వాహనాలను తిరిగి పంపించినట్లు మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వెనక్కి పంపించడం వల్ల రవాణా భారంతోపాటు సీఎంఆర్ బకాయి సైతం ఎక్కువ చూపిస్తుందని వాపోతున్నారు.
జనవరి 31వ తేదీ అర్ధరాత్రి కాంటా ఆన్లైన్ ఆగిపోయింది. వ్యాగన్ రావడంతో హమాలీలు వ్యాగన్ను పంపించి లారీలను దించారు. తిరిగి ఆర్డర్ వస్తేనే ఆన్లోడింగ్ జరుగుతది. ఏదైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆగాల్సి ఉంటుంది. మరాడించిన బియ్యాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పెడితే ఆఖరు రోజు ఇలాంటి సమస్య రాదు.
– చంద్రమోహన్, ఎఫ్సీఐ డిపో మేనేజర్, మంచిర్యాల