గుడిహత్నూర్/ఎదులాపురం, జూలై 8:ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి చర్చిలో ప్రార్థనలకు వెళ్లి, శనివారం తెల్లవారుజామున ఆటోలో బయల్దేరిన వారిని గుర్తుతెలియని వాహనం మృత్యువురూపంలో కబళించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి పరిశీలించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని మేకలగండి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ చర్చిలో ప్రార్థనలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆటో ఎగిరి జాతీయరహదారి పక్కనుండే కాలువలో పడిపోయింది. దీంతో ఆదిలాబాద్లోని రవీంద్రనగర్కు చెందిన ఆటో డ్రైవర్ పొచ్చన్న(65) ఆయన భార్య గంగవ్వ(50) వారి కూతురు శైలజ (35) మరో మహిళ సోంబాయి(62) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో మడావి ప్రేమ్సాగర్( 46), మడావి దీపక్(15), తేజవర్ధన్(12), ఆరాధ్య(3), చిన్ని(8నెలలు) ఉన్నారు. ఇందులో ఇద్దరు చిన్నారుల తల్లి శైలజ మృతి చెందింది. మృతదేహాలను జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ డీ ఉదయ్కుమార్, ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. రవీంద్రనగర్కు చెందిన పోశన్న, గంగవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. అందరికీ పెండ్లిళ్లయ్యాయి. ఇందులో ఓ కూతురు శైలజ (28) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. శైలజ ప్రస్తుతం కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్నది. అయితే రెండో కాన్పు కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నది. శుక్రవారం సాయంత్రం పోశన్న తన ఆటోలో భార్య గంగవ్వ , కూతురు శైలజ, మనవరాళ్లు(శైలజ కూతుళ్లు), మనవడు తేజవర్ధన్( శైలజ అక్క కొడుకు), సంజయ్నగర్కు చెందిన సోంబాయి, ఆమె కొడుకు ప్రేమ్ సాగర్, మనవడు దీపక్రాజ్తో కలిసి ఇచ్చోడలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరారు. ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోశన్న, గంగవ్వ, శైలజ మృతి చెందారు. ఆటోలోనే ఉన్న శైలజ ఎనిమిది నెలల బిడ్డ భద్రంగా ఉంది. మరో కూతురు ఆరాధ్య(3) స్వల్ప గాయాలతో బయటపడింది. దీపక్రాజ్, తేజ్వర్ధన్ను హైదరాబాద్ తరలించారు.
తల్లడిల్లిన పిల్లలు.. భర్త కన్నీరుమున్నీరు
శైలజ మృతితో చిన్నారి ఆరాధ్య, ఎనిమిది నెలల పాప దిక్కులు చూస్తున్నారు. జన్నారంలో వ్యవసాయం చేసుకునే శైలజ భర్త కిరణ్ ఘటనాస్థలానికి చేరుకొని రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. భార్య, పిల్లలిద్దరినీ మరికొన్ని రోజుల్లో జన్నారం తీసుకెళ్లడానికి సిద్ధమవుతుండగా, ఇంతలోనే శైలజ మృతి చెందింది.
ప్రేమ్సాగర్కు మూడు నెలల్లో ఇది రెండో విషాదం
ఇక సంజయ్ నగర్కు చెందిన సోంబాయి (75) కూడా ఈ ఘటనలో మృతి చెందింది. ఈమె కొడుకు ప్రేమ్సాగర్ గాయాలతో బయటపడ్డాడు. ప్రేమ్సాగర్ భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. మూడు నెలల క్రితం ఆమె ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ దుఖం నుంచే ఇంకా తేరుకోని ప్రేమ్సాగర్కు ఇపుడు తల్లి సోంబాయి మృతి తీవ్ర విషాదం మిగిల్చింది.
కెస్లాగూడ.. కన్నీటి సంద్రం
ఇంద్రవెల్లి, జూలై 8: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేముల పోశెట్టిది కెస్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కెస్లాగూడ(ఎం)గ్రామం. 35 ఏండ్ల క్రితమే క్రితం ఆదిలాబాద్కు వెళ్లి, అక్కడే వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య గంగవ్వ, కూతురు శైలజ మృతిచెందడంతో, కుటుంబ సభ్యులు, సమీప బంధువులు వారి మృతదేహాలను కెస్లాగూడ(ఎం)కు తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి బంధువులతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటికకు తరలించి, అంత్యక్రియలు చేశారు.